దేవాలయాలపై కొనసాగుతున్న దాడులు... మరో సీతారామ ఆలయంలో విధ్వంసం
తాజాగా కర్నూల్ జిల్లాలోని ఓ పురాతన సీతారాముల దేవాలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.
కర్నూల్: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయంపై దాడుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు దేవాలయాలపై, దేవతా విగ్రహాలపై దాడి ఘటనలు చోటుచేసుకోగా తాజాగా కర్నూల్ జిల్లాలో ఓ పురాతన దేవాలయం కూడా ధ్వంసమయ్యింది. డోన్ మండల పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
డోన్ మండలం వెంకటరాయునిపాలెం గ్రామంలోని సీతారాముల ఆలయంపై అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు. ఆలయంలోని రాతి స్తంభాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఉదయం స్తంభాలు ముక్కలై ఉండటం చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన స్తంభాలతో పాటు ఆలయం మొత్తాన్ని పరిశీలించారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యుడు శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్వేది రధం దగ్దం ఘటన మొదలు రాష్ట్రంలో ఎదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే వున్నాయి. ఇటీవల అగర మంగళంలోని అభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఎదుట గల నంది విగ్రహాన్ని అర్థరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు పెకిలించి బయటకు తీసుకువచ్చారు. ఇలా ఆ విగ్రహాన్ని ఆలయం వెనకకు తీసుకెళ్లి ధ్వంసం చేశారు.
read more ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు... ఆ బాధ్యత ప్రభుత్వానిదే: చిన్నజీయర్
ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఈ దాడులను నిరిసిస్తూ నిరసన బాట పట్టాయి. ఇలా హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీ రాజకీయాలనూ వేడెక్కిస్తున్నాయి.