ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ఆత్మకూరు ఉపఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరు స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆత్మకూరు ఉపఎన్నిక పోలింగ్‌కు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ఆత్మకూరు ఉపఎన్నిక బరిలో 14 మంది అభ్యర్థులు నిలిచారు. వైసీపీ అభ్యర్థిగా గౌతమ్‌ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా భరత్‌కుమార్, బీఎస్పీ అభ్యర్థిగా న్యాయవాది ఓబులేసు, మరో 11 మంది పోటీలో ఉన్నారు. మేకపాటి కుటుంబ సభ్యులకే టిక్కెట్ ఇచ్చినందున.. గత సంప్రదాయాన్ని పాటించి ఉప ఎన్నికకు దూరంగా ఉంటున్నట్లు టీడీపీ ప్రకటించింది. 

ఇక, ఆత్మకూరు నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లున్నారు. ఆత్మకూరు ఉప ఎన్నిక కోసం మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 131 సమస్యాత్మక, 148 సాధారణ పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఉపఎన్నికకు సంబంధించి కలెక్టరేట్‌లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు. 78 పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ జరుగుతుంది. ఎన్నికల విధుల్లో 1,409 పోలింగ్ సిబ్బంది, 1100 మంది పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌తో పాటు పోలీస్ యాక్ట్‌-30 అమల్లో ఉందని పోలీసులు తెలిపారు. 

మహిళ ఓటర్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ ప్రోటోకాల్ అమలు చేస్తున్నారు. ఇక, ఈ నెల 26న  ఆత్మకూరు ఉప ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి.