తెలుగుదేశం పార్టీ ఇవాళ సభ్యత్వ నమోదు ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించింది. ఈ సందర్బంగా కేవలం పార్టీ కార్యాలయాలు, నాయకుల చుట్టూ తిరిగే నాయకులకు అచ్చెన్నాయుడు తీవ్రంగా హెచ్చరించారు.  

మంగళగిరి: కేవలం పార్టీ కార్యాలయాల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగేవారికి భవిష్యత్ లో ఎలాంటి పదవులు ఉండవని ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (kinjarapu atchannaidu) హెచ్చరించారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడంతో పాటు పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారికే తగినగుర్తింపు లభిస్తుందని అన్నారు. ఇందుకు తగినట్లుగా డిజిటల్ సభ్యత్వ తీరుతెన్నులు ఉండనున్నాయని అచ్చెన్న పేర్కొన్నారు. 

మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు అచ్చెన్నాయుడు పాల్గోన్నారు.  

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...    తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 సంవత్సరాలు పూర్తయిందన్నారు. పార్టీ పట్ల అభిమానం వున్న ప్రతిఒక్కరు హాయిగా ఇంట్లో వుండే డిజిటల్ పద్దతిలో సభ్యత్వం తీసుకోవచ్చని తెలిపారు. పసుపు సైనికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సభ్యత్వ నమోదు ప్రక్రియకుచంద్రబాబు ప్రారంభించారని... ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సభ్యత్వ నమోదు ప్రక్రియలో భాగం చేయడం జరిగిందన్నారు అచ్చెన్న. 

పేపర్ లెస్ పరిజ్ఞానంతో కొత్తగా ప్రారంభించిన సభ్యత్వ నమోదు నాయకులకు, కార్యకర్తలకు మధ్యవారధిగా ఉండేలా సరికొత్తగా ఆరంభించామన్నారు. సభ్యత్వం తీసుకున్నవారి చరిత్ర, వారి పనితనం తదితర వివరాలన్నీ డిజిటల్ కార్డులోనే వుంటాయన్నారు. ఒక పద్దతి, ప్రణాళిక ప్రకారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించిన దేశంలోనే ఏకైక పార్టీ తెలుగుదేశం అని అచ్చెన్న కొనియాడారు. 

సభ్యత్వం తీసుకున్నవారికి పార్టీ అన్నివిధాలా అండగా ఉండి సహాయ సహకారాలందిస్తుందన్నారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు 5ఏళ్లలో రూ.100కోట్ల వరకు బీమా సహాయం కింద చెల్లించడం జరిగిందన్నారు. దీంతో సభ్యత్వం తీసుకున్నవారికి  బీమా పరిహారంగా రూ.2 లక్షలు చెల్లించడం జరుగుతుందన్నారు. టీడీపీ కుటుంబంలో 60లక్షల మంది సభ్యులుండటం గర్వంగా బావించాల్సిన గొప్ప విషయమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

ఇక ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్ సీఎం జగన్ పై సెటైర్లు విసిరారు. తొలుత టిడిపి సభ్యత్వాన్ని పుస్తకాల్లో, తరువాత కంప్యూటర్లలో చేశాము... ఇప్పుడు స్మార్ట్ ఫోన్లలోని వాట్సాప్, టెలిగ్రామ్  ఫీచర్లతో చేయబోతున్నామన్నారు. ఇలా తమ పార్టీ కార్యకర్తలకు అండగాఉండేలా టెక్నాలజీని వాడుకుంటుంటే ఈ వేస్ట్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు. సీఎం జగన్ కి సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలియకుంటే తనకు అడిగితే చెప్తాను కదా! అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు. 

ఈ ముఖ్యమంత్రి, వైసిపి ప్రభుత్వం ఏం చేసినా...ఎన్నికేసులు పెట్టినా పసుపు జెండాను ఏమీ పీకలేరని లోకేష్ అన్నారు. నాడు,నేడే కాదు రేపు కూడా టీడీపీ కార్యకర్తల  కోసం పనిచేస్తూనే ఉంటామని... వారిని అన్నిరకాలుగా ఆదుకోవడానికే సభ్యత్వనమోదుకి శ్రీకారం చుట్టామని లోకేష్ అన్నారు.