మా కార్పోరేటర్ ఇంట్లోకి చొరబడి... మహిళలతో అంత నీచంగానా..: వైసిపి నేతలపై అచ్చెన్న ఫైర్
ఒంగోలులో టిడిపి కార్పోరేటర్ రవితేజ ను అధికార వైసిపి నాయకులు నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారని... తాజాగా అతడి ఇంటిపైకి వెళ్లి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారని ఏపి టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒంగోలు: ప్రజా మద్దతులో ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నేతలను అధికార అండతో వైసీపీ నాయకులు వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఒంగోలు పట్టణానికి చెందిన టిడిపి కార్పొరేటర్ రవితేజను వైసీపీ నేతలు వేధిస్తూ, అనేక ఇబ్బందులు పెడుతున్నారని వెల్లడించారు. ఎన్నికలు అయిపోయి నాలుగు నెలలు అవుతున్నా ఇంకా వేధించడం సబబు కాదన్నారు. చేతనైతే ప్రజా మద్దుతుతో గెలవండి... అంతేగానీ ఇలాంటి చిల్లర రాజకీయాలను చేయవద్దని వైసిపి నాయకులకు సూచించారు అచ్చెన్న.
''ఒంగోలు 26వ డివిజన్ కార్పొరేటర్ రవితేజ ఇంట్లోని మహిళల పట్ల నీచంగా ప్రవర్తించిన దుర్మార్గులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలి. దాడి చేసిన వారిమీద కేసులు పెట్టకుండా బాధితుల మీద, సంబంధం లేని వారి మీద తిగిరి కేసులు పెట్టడం ప్రభుత్వ రాక్షస క్రీడకు నిదర్శనం. ఇంట్లో మహిళలపై తాగి వచ్చి ఇష్టానుసారంగా ప్రవర్తించడం పద్ధతికాదు. మహిళలకు రక్షణ కల్పించలేని చేతకాని ప్రభుత్వం వైసీపీ'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
read more రాజకీయ నిరుద్యోగులకేనా ఉద్యోగాలు... యువతకి వద్దా జగన్ రెడ్డి గారు?: నారా లోకేష్
''రవితేజ కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలి. రవితేజకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత. గెలుపునకు వైసీపీ వారొక్కరే అతీతులా.? వైసీపీ వారు తప్ప మరెవరూ పదవుల్లో ఉండకూడదా.? సంబంధం లేని గొడవల్లో అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తే చూస్తూ ఊరుకోం. టీడీపీ వారిపై అక్రమ కేసులపై పెట్టే దృష్టి రాష్ట్రాభివృద్ధిపై పెడితే రాష్ట్రానికి ఎంతోకొంత మేలు జరుగుతుంది. టీడీపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అంతకంత మూల్యం చెల్లించుకుంటారు'' అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.