కరోనా రూల్స్ అతిక్రమించిన అశోక్ గజపతిరాజు!
అశోక్ గజపతిరాజు పైడితల్లి ఆలయంలో పూజలు చేయాలని అనుకున్నారు. దీంతో... ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయన వెంట తరలివెళ్లారు.
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు కరోనా రూల్స్ ని అతిక్రమించారు. కరోనా నియమాలు పట్టించుకోకుండా.. ఆయన వందల మంది అభిమానులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం విజయనగరం లోని పైడితల్లి ఆలయాన్ని సందర్శించారు.
దశాబ్దాల కాలంగా మంగళవారం ప్రజలు పైడితల్లి ఆలయానికి వెళ్లి.. అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అంతేకాకుండా.. జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని పక్కన పెట్టి.. మానస్, సింహాచలం టెంపుల్ ట్రస్ట్ ఛైర్మన్ పదవి నుంచి సంచరిత ను తొలగించి.. ఆ బాధ్యతలు అశోక్ గజపతిరాజు చేపట్టడమే న్యాయమని ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో.. అశోక్ గజపతిరాజు పైడితల్లి ఆలయంలో పూజలు చేయాలని అనుకున్నారు. దీంతో... ఆయన అభిమానులు, కార్యకర్తలు కూడా ఆయన వెంట తరలివెళ్లారు. అయితే... ఈ ఘటనపై విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి.కరోనా నియమాలు పాటించకుండా.. వందల సంఖ్యలో ఆలయానికి వెళ్లారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
కరోనా నియమాలు పాటించాలని చెబుతూ.. సిరమానోత్సవం జరుగుతున్న సమయంలోనూ అశోక్ గజపతిరాజు అమ్మవారిని దర్శించుకోడానికి రాలేదు.. కనీసం తన బంగ్లా వదిలి బయటకు రాలేదు.. ఇప్పుడు మాత్రం వందల మందితో కలిసి అమ్మవారి దర్శనానికి ఎందుకు వచ్చారు..? అంటూ స్థానిక రిటైర్డ్ టీచర్ ఒకరు ప్రశ్నించడం గమనార్హం.
కాగా.. కరోనా నియమాల ప్రకారం.. వందల మందిని ఆలయంలోకి అనుమతిండచం లేదని.. కేవలం ఒకరిద్దరిని మాత్రమే లోపలికి పంపిస్తున్నట్లు జిల్లా మెడికల్, ఆరోగ్య అధికారి ఎస్వీ రమణ కుమారి పేర్కొన్నారు.
కాగా.. ఈ ఘటనపై స్థానిక ఎస్పీ రాజ కుమారి కూడా స్పందించారు. అశోక్ గజపతిరాజుతో పాటు.. ఆలయానికి వందల మంది రాలేదని.. కేవలం 70,80 మంది మాత్రమే వచ్చారని.. అయితే.. అది కూడా కరోనా నియమాన్ని బ్రేక్ చేసినట్లే అవుతుందని చెప్పారు.