మాన్సాస్ జీతాల వివాదం.. వేతనం రాకుంటే మీరు పనిచేస్తారా: ఈవోపై అశోక్ గజపతి ఆగ్రహం
మాన్సాస్ ట్రస్ట్ సిబ్బంది వేతనాల సమస్యపై ఘాటు వ్యాఖ్యలు చేశారు అశోక్ గజపతి రాజు. మాన్సాస్ చైర్మన్గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదని.... జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు
సిబ్బంది జీతాల సమస్యపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ అశోక్ గజపతిరాజు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిబ్బంది జీతాల సమస్య ఇప్పటివరకు మాన్సాస్కి రాలేదన్నారు. జీతాల చెల్లింపుని అధికారులు సమస్యగా భావించటం సరికాదన్నారు. సిబ్బంది లేకపోతే సంస్ధలకు మనుగడే ఉండదని స్పష్టం చేశారు. సిబ్బంది పనిచేసేది జీతాల కోసం.. ఈవో ఇబ్బందులు కలిగించటం భావ్యం కాదని హితవు పలికారు. జీతమడిగితే కేసులు పెడతారా? అని అశోక్ గజపతి రాజు ప్రశ్నించారు. సిబ్బందిని మీరేమి చేయాలనుకుంటున్నారని ఆయన నిలదీశారు. మాన్సాస్ చైర్మన్గా తాను అడిగిన వాటికి సమాచారం ఇవ్వలేదని.... జీతం రాకపోతే ఈవో పనిచేయగలరా అని అశోక్ గజపతిరాజు ప్రశ్నించారు.
Also Read:మాన్సాస్ ట్రస్ట్లో కొత్త వివాదం.. జీతాల కోసం రోడ్డెక్కిన ఉద్యోగులు, అశోక్ టార్గెట్గా సంచయత ట్వీట్
కాగా, విజయనగరం జిల్లా మాన్సాస్ ట్రస్ట్ ఉద్యోగులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు. ఈ అంశంపై ట్రస్ట్ మాజీ ఛైర్మన్ సంచయిత చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. మీ అన్నగారి పుట్టిన రోజున ఇలా ఉద్యోగులతో ధర్నా చేయించడం సిగ్గుచేటంటూ పరోక్షంగా అశోక్ గజపతి రాజును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు సంచయిత.