ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా ఈ కొత్త మార్పును ప్రారంభించిన తర్వాత 19వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ చేపడతారు.
అమరావతి : ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఆరోగ్యశ్రీ కింద అర్హులైన వారందరికీ ఉచిత చికిత్స విలువను రూ.25 లక్షలకు పెంచింది. ఈ మేరకు బుధవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ విలువ రూ. ఐదు లక్షలు మాత్రమే ఉండేది. ఆరోగ్యశ్రీ సంబంధిత అధికారులతో బుధవారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ పెంపు డిసెంబర్ 18వ తేదీనుంచి అమలులోనికి రానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతులమీదుగా ప్రారంభించిన తర్వాత 19వ తేదీ నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ చేపడతారు.
ప్రతి నియోజకవర్గంలో ఐదు గ్రామాలను ఎంపిక చేశారు. ఈ ఎంపిక చేసిన గ్రామంలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారు. ఈ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జనవరి నెల ఆఖరువరకు జరుగుతుంది. జగనన్న ఆరోగ్య సురక్ష కింద జనవరి 1 నుంచి మలివిడత వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. మరోవైపు.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం వాసుల కిడ్నీ సమస్యల పరిష్కారానికి రూ. 700 కోట్లతోవైయస్సార్ సుజలధార ప్రాజెక్టును నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టును గురువారంనాడు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు.
ఏపీ లోకాయుక్త సంచలన తీర్పు .. 60 ఏళ్ల వివాదానికి పరిష్కారం , భార్య చేతికి అందిన పెన్షన్
ఈ ప్రాజెక్టు కింద బాధితులకు చికిత్సతో పాటు.. సమస్య ఎందుకు వచ్చింది అనే కారణాలపై పరిశోధన చేస్తారు. దీనికోసం రూ.85 లక్షలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ను నిర్మించారు. 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. ఈ రెండింటిని గురువారం నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు.
ఈ ప్రాజెక్టు కింద ఉద్దానంలోని ఏడు మండలాలకు చెందిన 807 గ్రామాలకు హీరమండలం రిజర్వాయర్ నుంచి నీటిని తెప్పించి.. రక్షిత మంచినీరును అందిస్తారు. ఇక కిడ్నీ బాధితుల కోసం టెక్కలి, పలాస, సోంపేట, కవిటి, హరిపురం ఆస్పత్రుల్లో డయాలసిస్ కోసం 74 యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి ఆసుపత్రిలోనూ 37 రకాల మందులను ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు లక్షణాలున్న వారి రక్త నమూనాలను కూడా సేకరించి పరీక్షలు నిర్వహిస్తారని’ ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించింది.
