ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త .. ఛార్జీలు తగ్గింపు, కానీ ఆ బస్సులకు మాత్రమేనట
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అమరావతి, గరుడ, వెన్నెల బస్సుల్లో ఛార్జీలు దిగిరానున్నాయి
ప్రయాణీకులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏసీ బస్సుల్లో ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇది తాత్కాలికం మాత్రమేనని సంస్థ తెలిపింది. ఆర్టీసీ నిర్ణయం వల్ల ఏసీ బస్సుల్లో 10 నుంచి 20 శాతం ఛార్జీలు తగ్గాయి. ఈ తగ్గింపు సెప్టెంబర్ నెలాఖరు వరకు మాత్రమే అందుబాటులో వుంటుందని ఏపీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఏసీ బస్సుల్లో ఛార్జీల తగ్గింపు నిర్ణయాన్ని రీజనల్ మేనేజర్ల చేతుల్లో పెట్టింది యాజమాన్యం. ఆయా రూట్లు, ఎంత తగ్గించాలనే దానిపై రీజనల్ మేనేజర్లు నిర్ణయం తీసుకుని.. అందుకు తగినట్లు ప్రకటనలు విడుదల చేసే అవకాశం వుంది. మరోవైపు ఆర్టీసీ నిర్ణయం వల్ల.. నిత్యం రద్దీగా వుండే విజయవాడ-హైదరాబాద్ రూట్లో ప్రయాణించే ప్రయాణీకులకు లబ్ధి కలగనుంది. ఈ రూట్లో చక్కర్లు కొట్టే.. అమరావతి, గరుడ, వెన్నెల బస్సుల్లో ఛార్జీలు దిగిరానున్నాయి.
కాగా.. ఈ ఏడాది జూలైలో ఏపీఎస్ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. డీజిల్ సెస్ పెంపు కారణంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. అయితే ఈ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్పై ప్రస్తుతం రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70.. హైదరాబాద్ వెళ్లే అమరావతి ఏసీ బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ పెంచుతున్నట్లు అప్పట్లో ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
ALso Read:ఏపీలో బస్సు ఛార్జీల పెంపు.. రేపటి నుంచే అమల్లోకి, ఏయే బస్సుల్లో ఎంతంటే..?
పల్లె వెలుగు బస్సుల్లో.. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. అయితే తొలి 30 కిలోమీటర్ల వరకు సెస్ పెంపు లేదు. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్ వసూలు చేస్తారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10...100 కి.మీ ఆపైన రూ.120 సెస్ విధించారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్పై రూ.5లు సెస్ కింద వసూలు చేస్తున్నారు. కానీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 ..66 నుంచి 80కి.మీ వరకు రూ.10ను సెస్ కింద వసూలు చేస్తున్నారు. తాజాగా ఛార్జీలు తగ్గించిన నేపథ్యంలో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.