సీఎం జగన్ మరో కీలక నిర్ణయం: ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు లోనూ రివర్స్ టెండరింగ్
రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలను ఇస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన అంశంలో రివర్స్ టెండరింగ్ ను అనుసరించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలను ఇస్తున్న తరుణంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన అంశంలో రివర్స్ టెండరింగ్ ను అనుసరించాలని సీఎం జగన్ నిర్ణయించుకున్నారు.
ఎలక్ట్రిక్ బస్పులపై వైసీపీ ప్రభుత్వం నియమించిన ఆర్టీసీ నిపుణుల కమిటీ తమ నివేదికన సీఎం జగన్మోహన్ రెడ్డికి అందజేసింది. ఎలక్ట్రిక్ బస్సుల వినియోగానికి సంబంధించి పలు సూచనలు చేసింది.
పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రాధాన్యత ఇచ్చి అందుకు అవసరమైన ఆదాయ వనరులను వివిధ మార్గాల ద్వారా సమీకరించుకోవాలని సూచించింది. ఆర్టీసీ ఛార్జింగ్ పాయింట్ల వద్ద సోలార్ పవర్ కు ప్రాధాన్యం కల్పించాలని సీఎం జగన్ కు సూచించింది.
ఆర్టీసీ కాంప్లెక్స్ లు వద్ద అనుకూలంగా ఉన్న చోట సోలార్ పవర్ రూఫ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. తిరుమలలో ఎలక్ట్రిక్ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని అలాగే అలిపిరి, తిరుమలలో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు భూములు కేటాయించాలని కూడా స్పష్టం చేసింది.
ఎలక్ట్రిక్ బస్సు టెండర్లలో రివర్స్ టెండరింగ్ పద్దతిని అనుసరించడం ఉత్తమమని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలిసిన వారిలో కమిటీ చైర్మన్ ఆంజనేయరెడ్డి, కమిటీ సభ్యులు, ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు ఉన్నారు.