ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయాన్ని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయాన్ని ప్రకటించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నట్టుగా తెలిపింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు జరగాల్సి ఉంది. అయితే గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని.. తాము ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయం ఇవ్వాలని మెయిన్స్‌కు క్వాలిఫై అయిన పలువురు అభ్యర్థులను ఏపీపీఎస్సీని కోరుతున్నారు. విద్యార్థి సంఘాలు కూడా ఇదే విధమైన డిమాండ్ చేస్తున్నారు. 

మరోవైపు సివిల్స్-2022 ఫేజ్ 3 ఇంటర్వ్యూలను ఏప్రిల్ 24 నుంచి మే 18 వరకు నిర్వహించనున్నట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఇంటర్వ్యూలకు ఏపీ నుంచి 25 మంది గ్రూప్-1 అభ్యర్థులు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల భవిష్యత్ దృష్ట్యా గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేస్తున్నట్టుగా ఏపీపీఎస్సీ పేర్కొంది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను జూన్ మొదటి వారంలో నిర్వహించనున్నట్టుగా తెలిపింది. జూన్ 3 నుంచి 9 వరకు గ్రూప్-1 మెయిన్స్‌ను నిర్వహించనున్నట్టుగా వెల్లడించింది.

ఇక, గ్రూప్-1 పోస్టుల కోసం ఏపీపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను ఈ ఏడాది జనవరి 8న నిర్వహించింది. ఆ తర్వాత కేవలం 20 రోజుల్లోనే ఫలితాలను కూడా ప్రకటించింది. ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు మొత్తం 87,718 మంది అభ్యర్థులు హాజ‌రుకాగా.. 6,455 మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించి మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.