చంద్రబాబుపై మరో కేసు : ఇసుక అక్రమ తవ్వకాల స్కాంలో ఏ2గా టీడీపీ చీఫ్.. దేవినేని, చింతమనేనిలపైనా అభియోగాలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఆయనపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్ జగన్ ప్రభుత్వం మరో షాకిచ్చింది. ఆయనపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాకు సంబంధించిన కేసులో చంద్రబాబును సీఐడీ ఏ2గా చేర్చింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు ఈ కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ 1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ 3గా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ , ఏ 4గా మాజీ మంత్రి దేవినేని ఉమాలను చేర్చింది.
ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం కలిగించారనే ఫిర్యాదుతో చంద్రబాబు తదితరులపై కేసులు నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది. ఇప్పటికే చంద్రబాబు నాయుడుపై అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, స్కిల్ డెవలప్మెంట్, అసైన్డ్ ల్యాండ్స్, ఫైబర్ నెట్ కేసులను సీఐడీ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ALso Read: చంద్రబాబు హెల్త్ సీక్రెట్ ఇదే: బాబు మెనూ ఇదీ....
ఇకపోతే.. పైబర్ గ్రిడ్ వ్యవహారంపై దర్యాప్తును వేగవంతం చేసిన సిఐడి ఈ స్కాం ద్వారా లబ్దిపొందిన చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్మెంట్కు నిర్ణయం తీసుకుంది. ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలన్న ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం లభించింది. దీంతో ఆస్తుల అటాచ్ మెంట్ కు సిద్దమయ్యింది సిఐడి. చంద్రబాబు బినామీగా వైసిపి నాయకులు ఆరోపిస్తున్న వేమూరి హరికృష్ణప్రసాద్ కు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీ ఆస్తులను సిఐడి అటాచ్ చేయడానికి గుర్తించింది.
గుంటూరులో ఇంటి స్థలం, విశాఖపట్నంలో ఓ ఫ్లాట్, హైదరాబాద్లోని నాలుగు ఫ్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమిని సిఐడి అటాచ్ చేయడానికి సిద్దమయ్యింది. ఇప్పటికే హోంశాఖ అనుమతి లభించి ఉత్తర్వులు కూడా వెలువడిన నేపథ్యంలో సిఐడి మరింత దూకుడుగా ముందుకు వెళుతోంది. చంద్రబాబు సన్నిహితుల స్థిరాస్తుల అటాచ్ మెంట్ కు అనుమతి కోసం సిఐడి విజయవాడ ఏసిబి కోర్టుకు వెళ్లింది. కోర్టు అనుమతి లభిస్తే ఆస్తుల అటాచ్ మెంట్ ప్రక్రియ ప్రారంభంకానుంది.