వైఎస్ షర్మిలకు థ్రోట్ ఇన్ఫెక్షన్, వైరల్ ఫీవర్ ... ప్రస్తుత పరిస్థితి ఎలావుందంటే...
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో జోష్ నింపుతూ సొంత అన్న వైఎస్ జగన్ పైనే విరుచుకుపడుతున్న వైఎస్ షర్మిల రెండుమూడు రోజులుగా కనిపించడం లేదు. అయితే ఆమె అనారోగ్యం బారిన పడటంతో విశ్రాంతి తీసుకున్నారని... రేపటినుండి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నారని కాంగ్రెస్ ప్రకటించింది.
![APCC Chief YS Sharmila suffering throat infection and Viral Fever AKP APCC Chief YS Sharmila suffering throat infection and Viral Fever AKP](https://static-ai.asianetnews.com/images/01gqhja365tgwqy3gjjpg1x56e/ys-sharmila-jpg_363x203xt.jpg)
విజయవాడ: అనారోగ్యంతో బాధపడుతున్న ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కోలుకుంటున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దేశ రాజధాని డిల్లీలో ఆందోళన చేపట్టిన తర్వాత ఆమె అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ ఫీవర్ తో పాటు గొంతునొప్పితో బాధపడుతున్న ఆమె వైద్యుల సూచనమేరకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకున్నారు. రాజకీయాలకు దూరంగా ఇంటికే పరిమితం అయిన షర్మిల ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడినట్లు సమాచారం. దీంతో తిరిగి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్లేందుకు ఆమె సిద్దమయ్యారు.
షర్మిల అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 5 నుండి ప్రారంభంకావాల్సిన రచ్చబండ వాయిదా పడింది. అయితే అనారోగ్యంనుండి పూర్తిగా కోలుకున్న షర్మిల రేపటి(ఫిబ్రవరి 7 బుధవారం) నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఐదురోజుల పాటు ఆమె వివిధ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ రచ్చబండ, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత కొడుకు వివాహ వేడుకల కోసం మళ్లీ రాజకీయ కార్యకలాపాలకు బ్రేక్ ఇవ్వనున్నారు.
రేపు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ బాపట్లలో నిర్వహిస్తున్న బహిరంగసభలో షర్మిల పాల్గొంటారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సంసిద్దం చేసేలా ఆమె మట్లాడనున్నారు. అనంతరం ఫిబ్రవరి 8న ఉదయం తెనాలిలో రచ్చబండ, సాయంత్రం ఉంగుటూరులో బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఫిబ్రవరి 9న ఉదయం కొవ్వూరులో రచ్చబండ, సాయంత్రం తునిలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఫిబ్రవరి 10న ఉదయం నర్సీపట్నం, సాయంత్రం పాడేరులో బహిరంగసభ, ఫిబ్రవరి 11న సాయంత్రం నగరి బహిరంగసభకు హాజరుకానున్నారు.
Also Read వైఎస్ షర్మిలకు చెక్ పెట్టబోతున్నారా?
ఇక ఫిబ్రవరి 12 నుండి 20వ తేదీ వరకు కొడుకు రాజారెడ్డి పెళ్లిపనుల్లో బిజీగా వుండనున్నారు షర్మిల. గత నెలలో రాజారెడ్డి-ప్రియ ల నిశ్చితార్థం జరగ్గా ఈనెల 17న వివాహం జరగనుంది. కొడుకు పెళ్ళి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకునేందుకు ఎన్నికల సమయం అయినప్పటికి రాజకీయాలకు కొద్దిరోజులు బ్రేక్ ఇస్తున్నారు, ఫిబ్రవరి 21న తిరిగి రచ్చబండ, బహిరంగసభల్లో యధాతధంగా పాల్గొననున్నారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల.