సోషల్ మీడియాలో కరోనా ప్రచారం... తెలంగాణ కంటే ఏపీ టాప్: డాక్టర్ ఆర్జా శ్రీకాంత్
కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫేస్ బుక్ లో @ArogyaAndhra అనే పేరుతో అధికారిక పేజీని ప్రారంభించామనీ... ఈ పేజీకి ప్రస్తుతం 1,63,704 మందికి పైగా ఫాలోయర్స్ వున్నారని కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ తెలిపారు.
విజయవాడ: కరనా మహమ్మారిపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నాల్లో భాగంగా దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ మీడియాను వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఇలా ఏపీ ప్రభుత్వం కూడా కరోనాపై ప్రజల్ని చైతన్యపర్చేందుకు వాట్సప్ తో పాటు ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ విషయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ కంటే ఏపి మెరుగ్గా వుందని కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్టేట్ నోడల్ అధికారి డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
''కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫేస్ బుక్ లో @ArogyaAndhra అనే పేరుతో అధికారిక పేజీని ప్రారంభించామనీ... ఈ పేజీకి ప్రస్తుతం 1,63,704 మందికి పైగా ఫాలోయర్స్ వున్నారు. వివిధ రాష్ట్రాలకు కూడా ఇదే తరహా ఫేస్ బుక్ పేజీలు వున్నాయని... వాటిల్లో గుజరాత్ లో 25,564 మంది, తమిళనాడులో 7,953 మంది, తెలంగాణాలో 13,613 మంది, కర్నాటకలో 1,03,077 మంది, కేరళలో 1,17,544 మంది, ఒడిషాలో 89,068 మంది ఫాలోయర్స్ వున్నారు'' అని డాక్టర్ శ్రీకాంత్ వివరించారు.
read more ఏపీ: కరోనా కేసుల్లో భారీ తగ్గుదల.. ఆ రెండు జిల్లాల్లోనే అధిక తీవ్రత
కోవిడ్ ప్రచారంలో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విస్తృతంగా పాల్గొంటున్నట్లు గుర్తించిన ఫేస్ బుక్ యాజమాన్యం... ప్రస్తుత కరోనా సెకండ్ వేవ్ సమయంలో వాణిజ్య ప్రకటనలకు అనుమతిస్తూ దాదాపు 20 వేల డాలర్ల మేర ఆర్థిక సహకారాన్ని అందిస్తోందని ఆయన వెల్లడించారు. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో కూడా దాదాపు 15000 డాలర్ల మేర వాణిజ్య ప్రకటనలను అనుమతించటం ద్వారా ఆర్థిక సహకారాన్ని అందచేసిందన్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఏపీలో వున్న 20 లక్షల మందికి పైగా ఫాలోయర్స్ ను చేరేందుకు వీలుగా కరోనా అప్రమత్తత హెచ్చరికలు జారీకి ఫేస్ బుక్ యాజమాన్యం వీలు కల్పించిందని డాక్టర్ శ్రీకాంత్ పేర్కొన్నారు. మన దేశంలో ఫేస్ బుక్ యాజమాన్యం ఏపీతో పాటు కర్నాటకకు మాత్రమే ఈ తరహా వెసులు బాటు కల్పించిందన్నారు. అంతేకాక ఇందుకు సంబంధించిన కంటెంట్ డెవలప్ మెంట్ తో పాటు వారి ఫేస్ బుక్ మార్కెటింగ్ భాగస్వాముల ద్వారా వాణిజ్య ప్రకటనలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తున్నారని డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు.