స్పౌజ్ కేటగిరీ కింద 71,380 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం, జూన్ 12న పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేసింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సంక్షేమంపై మరింత దృష్టిసారిస్తూ, ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరొక కొత్త ప్రకటన చేసింది. ఇప్పటివరకు వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందించేవారు. ఇప్పుడు భర్త మరణించిన మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్పౌజ్ కేటగిరీ పింఛన్లను వచ్చే నెల నుంచే అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి నెలకు రూ.4000 చొప్పున పింఛన్లు మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ఆదేశాలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఇప్పటికే విడుదల చేసింది. జూన్ 12న ఈ కొత్త పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.ఇంతకుముందు, గత సంవత్సరం నవంబర్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు, భర్త మరణించిన తరువాత భార్యకు వెంటనే పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. దీని వల్ల పింఛనుదారులు ఇక నెలల తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా, తక్షణమే ఆర్థిక భరోసా అందుకునే అవకాశం కలుగుతుంది.
అర్హత కలిగిన మహిళలు, భర్త మరణ ధ్రువీకరణ పత్రం, స్వీయ ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలతో గ్రామ లేదా వార్డు సచివాలయాలను సంప్రదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను నెలాఖరులోగా పూర్తి చేస్తే, వచ్చే నెల నుంచే పింఛన్ జమవుతుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం తగినన్ని నిధులను వెచ్చించాల్సి ఉంటుంది. అధికారులు తెలిపిన ప్రకారం, కొత్తగా మంజూరైన 71,380 పింఛన్ల వల్ల ప్రభుత్వంపై నెలకు సుమారు రూ.35 కోట్ల అదనపు భారం పడనుంది.
ఇక జూన్ 12న జరగబోయే ఈ పింఛన్ పంపిణీ ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఎందుకంటే అదే రోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు ఒక సంవత్సరం పూర్తవుతుంది. ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని తల్లికి వందనం అనే మరో పథకాన్ని కూడా ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇక ఆగస్ట్ 15 నుంచి రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని సీఎం చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అదే సమయంలో అన్నదాత సుఖీభవ పథకం నిధులను కూడా పీఎం కిసాన్ యోజన అమలు సమయంలో అందజేస్తామని కడప మహానాడులో ప్రకటించారు.