చిట్టా రెడీ చేస్తున్నాం... వడ్డీతో సహా చెల్లిస్తాం..: వైసిపి నాయకులకు అచ్చెన్న హెచ్చరిక
నూజివీడులో టిడిపి కార్యకర్తలపై వైసిపి శ్రేణుల దాడిని ఖండించారు అచ్చెన్నాయుడు.ఈ క్రమంలోనే వైసిపి నాయకులను తీవ్రంగా హెచ్చరించారు.
గుంటూరు: మీకు పట్టిన దాడుల దాహాన్ని త్వరలోనే తీరుస్తాం... టీడీపీ వారితో ఎందుకు పెట్టుకున్నామా? అని మీరు దిగులు పడే రోజు దగ్గర్లలోనే వున్నాయంటూ వైసిపి నాయకులను హెచ్చరించారు ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. వైసిపి వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని వ్యవహరిస్తే బాగుంటుందని అచ్చెన్న హెచ్చరించారు.
''తాజాగా నూజివీడులో టీడీపీ కార్యకర్తలు మంచోడు మణి, కుంకునోళ్ళ నాగబాబుపై వైసీపీ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ముష్కరుల మాదిరి దారికాచి టీడీపీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. తక్షణమే నిందితులపై కేసు నమోదు చేసి శిక్షించాలి'' అని పోలీసులను కోరారు.
read more జగన్.. ప్రజల రక్తం పీలుస్తున్నారు.. లోకేష్
''బాధితులైన టీడీపీ కార్యకర్తలు వైసీపీ వారిపై కేసు పెడితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడం ఆక్షేపనీయం. బాధితులపైనే కేసులు పెట్టే వింతైన సాంప్రదాయానికి ఏపీ పోలీసులు నాంది పలికారు. పోలీసులు వేసుకుంది నీలి చొక్కాలు కాదు.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలి. మా కార్యకర్తల జోలికి వచ్చిన ప్రతి ఒక్కరి చిట్టా రాసి పెడుతున్నాం. వడ్డీతో సహా చెల్లించుకోవడానికి వైసీపీ సిద్ధంగా వుండాలి'' అని హెచ్చరించారు.
''ఇప్పటి వరకు 1400 మందికి పైగా మా కార్యకర్తలపై దాడి చేశారు. 29 మందిని పొట్టనబెట్టుకున్నారు. శాంతిభద్రతల పట్ల డీజీపీకి విశ్వాసం వుంటే ఇప్పటి వరకు జరిగిన అరాచకాలపై విచారణ జరిపి నిందితులను శిక్షించాలి. రాష్ట్రంలో అరాచకం జడలు విప్పుతున్నా పోలీసులు చూస్తుండిపోవడం బాధాకరం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు. స్వేచ్ఛగా వ్యక్తి తిరే రోజులు లేవు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంత కాలం రాష్ట్రం బీహార్ కంటే దారుణంగా వుంటుంది'' అని అచ్చెన్న మండిపడ్డారు.