దేశంలోనే అత్యంత పిరికి సీఎం జగన్ రెడ్డే...: అచ్చెన్నాయుడు ఫైర్
దేశంలో అత్యంత పిరికి ముఖ్యమంత్రి ఎవరైనా వున్నారంటే అది ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.
అమరావతి: ప్రతిపక్ష నేతలను చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు? అని ఏపీ టీడీపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. దేశంలో అత్యంత పిరికి ముఖ్యమంత్రి ఎవరైనా వున్నారంటే అది ఒక్క జగనే అని విమర్శించారు.
''టీడీపీ నేతలు ఇళ్ల నుండి కాలు బయటపెట్టగానే వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు, కడప జిల్లాలో బీటెక్ రవి, లింగారెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదును ఖండిస్తున్నా. పేదలపై పెను భారంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని నిరసన వారిపై కోవిడ్ ఉల్లంఘన పేరుతో అక్రమ కేసులు పెట్టడం దుర్మార్గం'' అని అన్నారు.
''మహామేత వర్థంతి సభలకు, వైసీపీ నేతల పాదయాత్రలకు కోవిడ్ నిబంధనలు వర్తించవా? మందల్లాగా బజార్లలో తిరిగిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులు పోలీసులు ఎన్ని నమోదు చేశారు?'' అని అచ్చెన్న నిలదీశారు.
read more మీరెందుకు జగన్ రెడ్డి... మీ అవినీతే సిగ్గుతో తలదించుకుంటుంది: లోకేష్ సెటైర్లు
''ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ విధానాలపై నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. శాంతియుతంగా నిరసన తెలిపితే అక్రమ కేసులా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? ఎమర్జెన్సీని మించిన నియంతృత్వం... హిట్లర్, గడాఫీలను మించిన అరాచకం రాష్ట్రంలో నడుస్తోంది'' అని మండిపడ్డారు.
''దమ్మిడికి పనికిరాని పదవులకు మీరు వేలాది మందిని తీసుకొచ్చి ప్రమాణస్వీకారాలు, రికార్డింగ్ డాన్సులు వేయొచ్చా? ప్రజలపై పడుతున్న భారాలని తగ్గించాలని అడిగిని మా నేతలపై అక్రమ కేసులా? కాల్వ శ్రీనివాసులుపై సుమోటోగా కేసు నమోదు చేసిన బొమ్మనహల్ ఎస్సై రమణారెడ్డికి వైసీపీ నేతల ఉల్లంఘనలు కనబడలేదా? లేకుంటే తాడేపల్లి రాజప్రసాదం ఆదేశాలు రాలేదా? రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వైసీపీ నేతల చిట్టా మా దగ్గర వుంది..వారిపై సుమోటోగా కేసు నమోదు చేసే ధైర్యం డీజీపీకి వుందా?'' అని నిలదీశారు.
''కరోనా ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి ఎన్నో బహిరంగ సభలను నిర్వహించారు. ఆయనపై ఎన్ని ఉల్లంఘన కేసులు నమోదు చేశారు? ప్రతిపక్షాలు బయటకు రాగానే ఉల్లంఘనలు కనబడతాయా? పోలీసులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారి గొంతు నొక్కుతున్నారు? చట్టానికి లోబడి పోలీసులు పనిచేస్తే ప్రజల చేత మంచి అనిపించుకుంటారు... లేకుంటే చరిత్ర హీనులవుతారు. కాఖీ చొక్కాలు వేసుకున్నామన్న సంగతి పోలీసులు మర్చిపోవద్దు'' అని అచ్చెన్న హెచ్చరించారు.