ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు నెల రోజుల్లోపే సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ సోమవారం ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు నేరుగా https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో 67.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 4,14,281 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే ఈ ఏడాది మొత్తం 6,15,908 మంది పరీక్షలు రాయగా.. 4,14,281 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అంటే దాదాపు 2 లక్షలకు పైగా (32 శాతానికి పైగా) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. 

పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులకు నెల రోజుల్లోపే సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. జూలై 6 నుంచి 15 తేదీ వరకు సప్లీమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా చెప్పారు. సప్లీమెంటరీ రాసే విద్యార్థులకు ఈ నెల 13 నుంచి స్పెషల్ క్లాసులు పెడుతున్నామని చెప్పారు. సప్లీమెంటరీ పరీక్షలకు సంబంధించి ఫీజును రేపటి నుంచే చెల్లించే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.

Also Read:AP SSC Result 2022: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల.. బాలికదే పైచేయి.. రిజల్ట్స్ ఎలా చూసుకోవాలంటే..

ఇక, పదో తరగతిలో 67.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పదో తరగతి పరీక్షల్లో బాలికలు పైచేయి సాధించారు. ఉత్తీర్ణ శాతం బాలికల్లో 70.70 శాతం, బాలురలో 64.02 శాతంగా ఉంది. ఫలితాల్లో 78.3 శాతం ఉత్తీర్ణతతో ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. 49.7 శాతం ఉత్తీర్ణతతో అనంతపురం ఆఖరిస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 797 స్కూళ్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. 71 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్‌ కాలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 27న ప్రారంభమైన టెన్త్‌ పరీక్షలు మే 9న పూర్తయ్యాయి. మొత్తం 3,776 పరీక్ష కేంద్రాల్లో ప‌రీక్ష నిర్వ‌హించ‌గా.. 6,22,537 మంది పదో తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించారు. ఈసారి పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు మాత్రమే ప్రకటిస్తారు. గతంలో ఉన్న గ్రేడింగ్‌ పద్ధతికి బదులు.. 2020 నుంచి విద్యార్థులకు మార్కులు ఇస్తున్నారు. మరోవైపు పరీక్షల ఫలితాలు వెలువరించాక.. విద్యాసంస్థలు, పాఠశాలలు తమ విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయంటూ ప్రకటనలు ఇవ్వకూడదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.