ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అకస్మాత్తుగా సెలపువై వెళ్తున్నారు. ఆయన ఈ నెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సెలవులో ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈనెల 16నుంచి 21వరకు సెలవులో ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన అరుణాచల్ ప్రదేశ్ పర్యటనకు వెళ్తున్నారు. దీన్ని బట్టి నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోవని అర్థమవుతోంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అకస్మాత్తుగా సెలవుపై వెళ్లడం లేదని, మూడు రోజుల క్రితమే ఆయన సెలవుకు దరఖాస్తు పెట్టుకున్నారని అధికార వర్గాలు చెప్పాయి. పంచాయతీరాజ్ శాఖ నిన్న సాయంత్రం సెలవును మంజూరు చేసిందని చెప్పాయి.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. దాంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల ఆశలపై నీళ్ళు చల్లినట్లేనని అంటున్నారు. ఏడాది కాలంగా ఎన్నికల కోసం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. నిరుడు మార్చిలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల తర్వాత పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయనే ఆశలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు ఉన్నారు. 
కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు చేస్తే రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంటుంది దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులు నెత్తీనోరు కొట్టుకుంటున్నారు. ప్రజల్లోనే ఉండటానికి ఏడాది కాలంగా స్థాయికి మించి ఖర్చు చేశామమని అభ్యర్థులు అంటున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నెల 14వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆయన సెలవులో ఉంటారు. ఈ రెండు స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించాననే సంతృప్తితో ఆయన ఉన్నట్లు కనిపిస్తున్నారు. అనేక అడ్డంకులను అధిగమించి ఆయన ఈ ఎన్నికలు నిర్వహించారు.