ఈ యాప్: జగన్ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు
ఈ యాప్ మీద జగన్ ప్రభుత్వం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. వాళ్ల పని వాళ్లది, మా పని మాది అని ఆయన అన్నారు.
అమరావతి: తాను విడుదల చేసిన ఈ వాచ్ యాప్ ను సవాల్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడంపై ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం కోర్టుకు వెళ్లకపోతే ఆశ్చర్యపోయేవాడినని ఆయన అన్నారు. వాళ్ల పని వాళ్లది, మా పని మాది అని ఆయన వ్యాఖ్యానించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం ఈ యాప్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దానిపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పందించారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టే చెప్పిందని, ఇక ఇవన్నీ ఎందుకని ఆయన అన్నారు. నిఘా యాప్ ను ప్రభుత్వం కూడా వాడుకోవచ్చునని ఆయన అన్నారు.
ముహూర్తం చూసుకుని ఈ యాప్ ను విడుదల చేస్తే ఇబ్బందులు ఎదురు కావని చెప్పారని ఆయన అన్నారు. తాను నాలుగు గోడల మధ్య కూర్చోనని, నిరంతరం జిల్లాల్లో పర్యటిస్తూనే ఉంటానని ఆయన చెప్పారు. ఈ యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదులు చేయవచ్చునని ఆయన చెప్పారు. ఫిర్యాదుల కోసం కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో కూడా ఎన్నికల కోసం టెక్నాలజీనీ వాడినట్లు ఆయన తెలిపారు.
యాప్ ను పారదర్శకంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదులు పరిష్కారమయ్యాయా లేదా అనేది కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుంటామని ఆయన అన్నారు. యాప్ రూపకల్పనలో వేరెవరూ లేరని, తామే రూపొందించాంమని ఆయన చెప్పారు తీవ్రమైన ఫిర్యాదులను వెంటనే అధికారులు పరిష్కరించాలని, లేదంటే అందుకు బాధ్యులు వారే అవుతారని, ఎన్నిక రద్దు చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఎస్ఈసీ అవసరాల కోసం, పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణకు యాప్ ను రూపొందించినట్లు నిమ్మగడ్డ తెలిపారు.యాప్ విడుదలపై తొందరేమీ లేదని, ముహూర్తం చూసుకుని విడుదల చేద్దామని ఆయన అన్నారు. దుర్గగుడిలో కూడా 11 నుంచి 11.45 గంటల మధ్య ముహూర్తం చెప్పారని ఆయన అన్నారు. యాప్ వేయి శాతం పారదర్శకతతో ఉంటుందని చెప్పారు. సమావేశాలతో కాలం గడిపే కన్నా పనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెప్పారు. మీడియా సమావేశంలో నిమ్మగడ్డ చిరునవ్వులు చిందించారు.