జేసీ బ్రదర్స్ కు జగన్ సర్కార్ షాక్: దివాకర్ ట్రావెల్స్ సీజ్
అనంతపురం జిల్లాలోని హిందూపురంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 15 బస్సులను తనిఖీ చేయగా వాటిలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని గుర్తించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసిదివాకర్ రెడ్డికి షాక్ ఇచ్చారు ఏపీ రవాణా శాఖ అధికారులు. జేసీ బ్రదర్స్ కు చెంిన దివాకర్ ట్రావెల్స్ ను రవాణాశాఖ అధికారులు సీజ్ చేశారు.
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్టీఏ కమిషనర్ సీతారామాంజనేయులు, జాయింట్ కమిషనర్ ప్రసాదరావు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చెందిన బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు.
నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 8 బస్సులను అధికారులు సీజ్ చేశారు.
జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ కు సంబంధించిన 8 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేసినట్లు తెలిపారు.
నిబంధనలకు విరుద్దంగా దివాకర్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నారని ఆర్టీఏ అధికారులు గుర్తించారు.
మెుత్తానికి 8 బస్సులను సీజ్ చేసినట్టు ఆర్టీఏ అధికారులు ప్రకటించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు
చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికుల నుంచి దివాకర్ ట్రావెల్స్పై అనేక ఫిర్యాదులు వచ్చాయని అందులో భాగంగానే తనిఖీలు చేసినట్లు చెప్పుకొచ్చారు.
దివాకర్ ట్రావెల్స్ పై విచారణ కొనసాగుతున్నట్లు కమిషనర్ ప్రసాదరావు తెలియజేశారు. ఇకపోతే ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై జేసీ దివాకర్ రెడ్డి విమర్శల అనంతరం ఆర్టీఏ అధికారులు దాడులు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే అనంతపురం జిల్లాలోని హిందూపురంలో కూడా ప్రైవేట్ ట్రావెల్స్ పై రవాణా శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. 15 బస్సులను తనిఖీ చేయగా వాటిలో దివాకర్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతున్నారని గుర్తించారు. అందులో భాగంగా 35 వేల జరిమానాను సైతం అధికారులు విధించారు.
రెండు రోజుల క్రితం ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జేసీ దివాకర్ రెడ్డి. వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుభవం లేదని మోదీ మంత్రదండం వల్లే జగన్ గెలిచారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పాలనలో సీఎం జగన్ మెుండిగా వెళ్తున్నారని తాను పట్టుకున్న కుందేలుకు మూడేకాళ్లు అన్న చందంగా వెళ్తున్నారని అదే జగన్ కు మంచి చెడూ రెండు తెచ్చిపెడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సలహాలు ఇచ్చేవారు లేరంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.