కేవలం మద్యం అమ్మకాల ద్వారానే... ఏటా జగన్ ఆదాయం ఎంతంటే: దేవినేని సంచలనం
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టిక్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారమే తాము వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలపై పడిన ధరలభారం గురించి మాట్లాడుతున్నామని బొండా స్పష్టంచేశారు.
విజయవాడ: వైసీపీ అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలు తలకిందులయ్యాయని, అసంఘటిత, భవననిర్మాణరంగ కార్మికులు సహా చేతి, కుల వృత్తులవారి జీవితాలు అగమ్య గోచరంగా మారాయని టీడీపీ నేత, మాజీఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వంలో విద్యుత్, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు సహా నిత్యావసరాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండేవని... ఈ ప్రభుత్వం వచ్చాక వాటి ధరలు పెంచారన్నారు. వైసిపికి అధికారాన్ని కట్టబెట్టినందుకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారన్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ ఎకనమిక్ అండ్ స్టాటిస్టిక్స్ వారు ఇచ్చిన నివేదిక ప్రకారమే తాము ప్రజలపై పడిన ధరలభారం గురించి మాట్లాడుతున్నామని బొండా స్పష్టంచేశారు. వైసీపీ ప్రభుత్వంలో బియ్యంపై రూ.10, కందిపప్పుపై రూ.25, పెసరపప్పు, మినపప్పు, సహా ఇతర నిత్యావసరాలుతో పాటు, గ్యాస్, విద్యుత్, పెట్రోల్-డీజిల్, ఆర్టీసీ ఛార్జీలను దారుణంగా పెంచడం జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వ వచ్చాకే ధరలు ఎందుకిలా పెరిగాయనే ఆలోచన ప్రజలు చేస్తున్నారని, జగన్ ప్రభుత్వ అసమర్థపాలనే ఇందుకు కారణమని వారు భావిస్తున్నారన్నారు. జగన్ ను నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కరూ తమ చెప్పులతో తామే కొట్టుకుంటున్నారని ఉమా ఎద్దేవా చేశారు.
20నెలల పాలనలో రూ.లక్షా40వేలకోట్ల అప్పులు చేశారని ఉమ ఆరోపించారు. ప్రభుత్వం ఆ సొమ్ముతోపాటు మద్యం, ఇసుక ధరలు పెంచడంతో పాటు, ల్యాండ్, మైనింగ్ మాఫియాల ద్వారా వస్తున్న సొమ్ముని ఏం చేస్తోందని టీడీపీ నేత నిలదీశారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని ఒక్కో సామాన్య కుటుంబంపై రూ.2లక్షల వరకు భారం పడిందని ప్రభుత్వ నివేదికలే చెబుతున్నాయన్నారు. పనుల్లేక, ఎక్కడా ఉపాధిలేక అల్లాడిపోతున్న ప్రజలు ఇంకా ఈ అవినీతి ముఖ్యమంత్రి పాలనలో ఎన్నాళ్లు బతకాలిరా దేవుడా అని వాపోతున్నారని ఉమా పేర్కొన్నారు.
read more ఏపీ పంచాయితీ ఎన్నికలు... జిల్లా కలెక్టర్లకు వైసిపి సర్కార్ కీలక ఆదేశాలు
గతంలో రూ.50లు అమ్మే క్వార్టర్ మద్యాన్ని ఇప్పుడు రూ.250చేశారని, ఉచితంగా లభించే ఇసుకను లారీ రూ. 50వేలకు అమ్ముకుంటున్నారని, పేదలకు ఇచ్చేఇంటిస్థలాల ముసుగులో వేలాదికోట్లను అడ్డగోలుగా దోచేయడం ద్వారా జగన్ ప్రభుత్వం లెక్కలేనంత దోపిడికీ పాల్పడిందన్నారు. ఈ విధమైన దోపిడీ అలా ఉంటే, ఇప్పటివరకు తీసుకొచ్చిన రూ.లక్షా40వేలకోట్ల అప్పులు, నిత్యావసరాలు సహా, వివిధ రకాలుగా పెంచిన ఛార్జీల భారం, ఆస్తిపన్ను, నీటిపన్ను, చెత్తపన్నుల ద్వారా వచ్చేసొమ్మంతా ఎక్కడికిపోతోందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీడీపీనేత నిలదీశారు.
ప్రజలనుంచి వచ్చే ఆదాయంతోపాటు, ల్యాండ్, మైనింగ్, శాండ్, లిక్కర్ మాఫియాలతో వచ్చే సొమ్ములో మంత్రులు, ముఖ్యమంత్రి వాటా ఎంతుందో చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. అప్పులరూపంలో తెచ్చిన రూ.లక్షా40వేలకోట్లు, అవినీతి ద్వారా సంపాదించిన రూ.లక్షకోట్లు ఏమయ్యాయో, ఒక్కో కుటుంబంపై రూ.2లక్షలవరకు భారం ఎందుకు మోపారో వైసీపీ ప్రభుత్వ పాలకులు సమాధానం చెప్పాలన్నారు. జగన్ ప్రభుత్వ అసమర్థత కారణంగానే నేడు రాష్ట్రంలోని ఒక్కో పేద కుటుంబంపై రూ.2లక్షల వరకు భారం పడిందన్నారు. ప్రభుత్వ ఇచ్చిన ధరలపట్టిక ప్రకారం, పెరిగిన ధరల ప్రభావం ద్వారా సామాన్యుడిపై పడుతున్న భారానికి ఎవరు బాధ్యతవహిస్తారన్నారు.
గుత్తాధిపత్యంగా ఇసుకను పక్కదారి పట్టించి సొమ్ముచేసుకుంటున్న ప్రభుత్వం, మద్యం అమ్మకాలతో మరోవిధంగా దోపిడీ చేస్తోందన్నారు. మద్యం అమ్మకాల ద్వారా వచ్చేసొమ్ములో ఏటా రూ.5వేలకోట్ల వరకు జగన్ కు ముడుతున్నాయన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానన్న ధరల స్థిరీకరణ నిధి ఏమైందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటే, ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్నారు. అప్పుల ద్వారా, అవినీతిద్వారా, వివిధ పన్నులరూపంలో ప్రజలనుంచి వసూలుచేసిన సొమ్ము అంతా ఏమవుతోందని, ఎవరికి ఖర్చు చేశారని టీడీపీనేత ఉమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.