రాజకీయాల్లోకి అశోక్ బాబు
ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు, ఉద్యోగుల సంఘం జేఏసీ ఛైర్మన్ అశోక్ బాబు రాజకీయాల్లోకి రానున్నారా..?
ఆంధ్రప్రదేశ్ ఎన్జీవోల సంఘ అధ్యక్షుడు, ఉద్యోగుల సంఘం జేఏసీ ఛైర్మన్ అశోక్ బాబు రాజకీయాల్లోకి రానున్నారా..? అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతోంది. అశోక్ బాబు.. తన పదవికి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. రాజకీయాల్లోకి రావాలనే ఉద్దేశంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
ఎప్పటి నుంచో అశోక్ బాబు రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతూనే ఉంది. ఒకానొక సందర్భంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. అశోక్ బాబుని స్వయంగా రాజకీయాల్లోకి రావాలని కోరారు కూడా. అప్పుడే ఆయన టీడీపీలో చేరిపోతారని అందరూ భావించారు. కానీ ఆయన చేరలేదు. 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయ ప్రవేశం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం అశోక్ బాబు ఉద్యోగ విరమణ చేయడంతో ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు, ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పోస్టులు ఖాళీ అయ్యాయి. ప్రస్తుతం ఎన్జీవోల ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎన్.చంద్రశేఖర్రెడ్డి ఈ రెండు బాధ్యతలూ చేపట్టనున్నట్లు తెలిసింది. శని, ఆదివారాల్లో ఎన్జీవోల సంఘం కార్యనిర్వాహక సమావేశం నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో గురువారం పదవీవిరమణ చేసిన అశోక్బాబుకు ఉద్యోగులు ఘనంగా వీడ్కోలు పలికారు.