షర్మిలపై సోషల్ మీడియాలో పోస్టులపై సోమిరెడ్డి కామెంట్స్
సోషల్ మీడియాలో షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు.
అమరావతి: సోషల్ మీడియాలో షర్మిలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుబట్టారు.
గురువారం నాడు అమరావతిలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.సోషల్ మీడియాలో షర్మిలపై జరిగిన దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. కుటుంబాల మీద, వ్యక్తిగతంగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం ఎవరూ చేసినా కూడ తప్పేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
పవన్ కళ్యాణ్ విషయంలో ఒకలా... షర్మిలా విషయంలో మరోకలా ఉండకూడదని సోమిరెడ్డి చెప్పారు. సోషల్ మీడియా వింగ్ పెట్టుకొని పోస్టులు పెట్టింది వైసీపీ కాదా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రతిదీ రాజకీయాలు చేయడం జగన్కు తగదన్నారు. టీడీపీకి చెందిన మహిళలపై పెట్టిన అసభ్య పోస్టులను సమర్ధిస్తారా అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైసీపీ నేతలను ప్రశ్నించారు.
తప్పుడు పోస్టులు ఎవరు పెట్టినా కూడ టీడీపీ ఆమోదించదని సోమిరెరడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదని షర్మిల చెప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు మినహా జగన్కు ఎవరిమీద నమ్మకం లేదా అని సోమిరెడ్డి ప్రశ్నించారు.