పవన్ కళ్యాణ్  ను  ఏపీ ప్రజలు అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వలేదని  ఏపీ మంత్రి రోజా  విమర్శించారు.  2019లో జగన్ ను సీఎం కాకుండా అడ్డుకుంటానని  పవన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి  స్పందించారు. 

అమరావతి: స్వంత ఊర్లోనే  పవన్ కళ్యాణ్, ఆయన అన్న  ఓటమి పాలయ్యారని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా  సెటైర్లు వేశారు.సోమవారం నాడు  ఏపీ మంత్రి రోజా  అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  నిన్న  వైసీపీపై, ఏపీ సీఎం వైఎస్ జగన్  పై  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు  మంత్రి రోజా కౌంటరిచ్చారు.  2019లో  జగన్ ను  సీఎం కానివ్వబోనని పవన్ కళ్యాణ్  చేసిన వ్యాఖ్యలపై మంత్రి  రోజా స్పందించారు.  వచ్చే ఎన్నికల్లో  జగన్  ను సీఎం   కాకుండా  చూస్తానని పవన్ కళ్యాణ్  చెబుతున్నారన్నారు. కానీ ప్రజలు మాత్రం  పవన్ కళ్యాణ్  ను అసెంబ్లీ గేటును కూడా తాకనివ్వలేదని ఆమె ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ తో  పాటు  ఆయన  అన్న ను కూడా ప్రజలు ఓడించారన్నారు. స్వంత ప్రాంతంలోనే  అన్నదమ్ములు ఓడిపోయారని ఆమె గుర్తు  చేశారు.  సినిమా హీరో వస్తే ఓట్లేస్తారనే రోజులు పోయాయని  మంత్రి రోజా  చెప్పారు.

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గంలో  కౌలు రైతు భరోసా యాత్రను జనసేనాని నిన్న నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వహించిన సభలో  పవన్ కళ్యాణ్  వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పతించారు.2019లో  జగన్ ను సీఎం కాకుండా అడ్డుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పారు.  2014 మాదిరిగా  కూటమి ఉంటే  రాష్ట్రంలో  వైసీపీ అధికారంలోకి  వచ్చి ఉండేది కాదని  పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.  విపక్షాలు విడి విడిగా పోటీ చేయడం వల్లే వైసీపీ విజయం సాధించిందన్నారు.  వచ్చే ఎన్నికల్లో  ప్రభుత్వ వ్యతిరేక  ఓటును చీలకుండా  తాను  ప్రయత్నిస్తానన్నారు.  

also read:దమ్ముంటే వారాహిని టచ్ చేయండి.. నేనేంటో చూపిస్తా : వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్

ఈ ఏడాది  ఆరంభం  నుండి   వైసీపీపై  పవన్ కళ్యాణ్  తీవ్ర స్థాయిలో  విరుచుకుపడుతున్నారు.  వచ్చే ఎన్నికల్లో  రాష్ట్రంలో  వైసీపీని  అధికారంలోకి రాకుండా చూస్తానని పదే పదే ప్రకటిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో  వైసీపీ  175 అసెంబ్లీ సీట్లు గెలిస్తుంటే  తాము చేతులు కట్టుకొని కూర్చొంటామా అని  కూడా గతంలో  పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.  వైసీపీ  పాలన  రాష్ట్రంలో  కొనసాగితే  ఏపీ రాష్ట్రం ఇంకా  వెనుకబాటుకు గురయ్యే అవకాశం ఉందని  కూడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.గత మాసంలోనే  ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో  పవన్ కళ్యాణ్  విశాఖపట్టణంలో  భేటీ అయ్యారు.  ఈ భేటీ ముగిసిన  తర్వాత  పవన్ కళ్యాణ్  అధికార పార్టీపై  దూకుడుగా  విమర్శలు గుప్పిస్తున్నారు.