రేపో మాపో  టీడీపీని మూసేస్తారని  ఏపీ మంత్రి జోగి రమేష్  చెప్పారు.  ఏం చేశారని మళ్లీ టీడీపీకి ఓటేయాలో  చెప్పాలన్నారు. 

విజయవాడ: ఏపీలో టీడీపీకి దిక్కులేదని ఏపీ మంత్రి జోగి రమేష్  చెప్పారు. రేపో మాపో టీడీపీని  మూసేస్తారని ఆయన చెప్పారు. ఆదివారంనాడు ఏపీ మంత్రి జోగి రమేష్  అమరావతిలో మీడియాతో  మాట్లాడారు.  ఏం చేశారని  చంద్రబాబుకు మళ్లీ ఓటేయాలో  చెప్పాలని  మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు ఏం అభివృద్ది చేశారో  చెప్పాలన్నారు.చంద్రబాబు, పవన్  కళ్యాణ్ లు కలిసి ప్రజలను  రెచ్చగొడుతున్నారని మంత్రి రమేష్  ఆరోపించారు. చంద్రబాబు, పవన్  కళ్యాణ్ లు అత్యంత నీచానికి  దిగజారారన్నారు. సీఎం జగన్  పాలనలో  ప్రజలు సంతోషంగా  ఉన్నారన్నారు.

also read:ఆయన చెప్పింది నిజమే.. పవన్ ఎప్పుడూ ఫెయిల్డ్ పొలిటీషియనే : అంబటి రాంబాబు చురకలు

రాష్ట్రంపై చంద్రబాబునాయుడు, పవన్  కళ్యాణ్ లు విష ప్రచారం చేస్తున్నారని  మంత్రి విమర్శించారు. ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా  కూడా  ప్రజలు నమ్మే పరిస్థితి లేదని  చంద్రబాబు గుర్తించాలన్నారు. జయహో  బీసీ, జయహో  జగన్  అనే నినాదం  ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్టుగా  మంత్రి తెలిపారు. రాజ్యసభ ఎంపీ నుండి  గ్రామ వార్డు మెంబర్ గా  సుమారు 82 వేల మంది  ప్రజా ప్రతినిధులుగా బీసీలకు  వైసీపీ కట్టబెట్టిందని మంత్రి చెప్పారు. రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బీసీల అభ్యున్నతి కోసం  జగన్  ప్రయత్నిస్తున్నారని చెప్పారు మంత్రి. లోకేష్  పనికిరాడనే ఉద్దేశ్యంతోనే  చంద్రబాబు తన దత్త పుత్రుడు పవన్  కళ్యాణ్  వెంటపడుతున్నాడన్నారు. లోకేష్‌  రాజకీయంగా పరిణితిలేని వ్యక్తిగా ఆయన పేర్కొన్నారు. దొడ్డిదారిన  ఎమ్మెల్సీ, మంత్రి అయిన వ్యక్తి లోకేష్  అని ఆయన మండిపడ్డారు.