వారు ఉత్తరాంధ్ర రక్షకులు కాదు.. భక్షకులు: మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక, రక్షణ వేదికల పేరిట వారు పోరాటాలు చేస్తున్నామంటున్నారని, ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు ఇలా చేయరాదని, వారొకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదని, ఉత్తరాంధ్ర భక్షకులని విమర్శించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. టీడీపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఘాటుగా స్పందించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక.. రక్షణ వేదిక వంటి పేర్లతో టీడీపీ నేతలు పోరాటాలు చేస్తున్నామంటున్నారని, ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఆ పార్టీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వాలు నడిపిన వ్యక్తులు ఇలా చేయడం సరికాదని, తమ పద్ధతి మార్చుకోవాలని అన్నారు. ఒకసారి ఆలోచన చేయాలని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని వ్యతిరేకిస్తున్నారని టీడీపీ నేతలపై ఆరోపణలు గుప్పించారు. అచ్చెన్నాయుడు, అశోక్ గజపతి రాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదని, భక్షకులను ఆరోపించారు.
అధికారంలో ఉండి, ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి మారిన టీడీపీ నేతలు ఇలాంటివి చేయకూడదన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానుల నినాదాన్ని తెచ్చారన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటిస్తే వారు కోర్టుకు వెళ్లారని మండిపడ్డారు. ఏ ఒక్క భవనాన్నీ కట్టకుండా అడ్డుతగిలారని అన్నారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని పోరాటాలు, ఇంకోటి అంటూ కార్యక్రమాలు చేపడుతున్నారని తీవ్రస్థాయిలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, సుజల స్రవంతి, స్టీల్ ప్లాంట్, గంగవరం పోర్టుపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. అసలు వారు ఏ ఉద్దేశంతో వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే వ్యతిరేకించారని మంత్రి బొత్స సత్యనారాయణ గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులకు ఈ విషయం చెప్పారు. మోడీ ప్రభుత్వంలో టీడీపీ నేత అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగా ఉన్నారన్నారు. అప్పట్లోనే ఈ ప్రైవేటీకరణ జరిగిందని తెలిపారు. ఈ పార్టీ నేతలు ఆనాడే ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు. అసలు అచ్చెన్నాయుడు, అశోక్ గజపతిరాజు, అయ్యన్నపాత్రుడు ఉత్తరాంధ్ర రక్షకులు కాదని, ఉత్తరాంధ్ర భక్షకులని ఆరోపించారు.