ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా.. నారా లోకేష్ పాదయాత్రపై అంబటి సెటైర్లు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు అంటూ మంత్రి ట్వీట్ చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్తో పాటు టీడీపీ యువ నేత నారా లోకేష్లపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్విట్టర్ ద్వారా వరుస ట్వీట్లు చేశారు. 'పవిత్రమైన దీపారాధనతో సిగరెట్టు ముట్టించుకునే వాడని స్వర్గంలో ఉన్న తన తండ్రినే అవమాన పరిచే పుత్రుడు సమాజానికి అవసరమా?' అని పవన్పై విమర్శలు చేశారు. అటు నారా లోకేశ్ ను ఉద్దేశస్తూ... 'ఎలుక తోలు తెచ్చి 400 రోజులు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు. గావంచ కట్టినోడల్లా గాంధీ కాలేడు. పాదయాత్ర చేసినోడల్లా నాయకుడూ కాలేడు' అని ట్వీట్ చేశారు.
కాగా.. నారా లోకేష్ యువగళం పాదయాత్రపై స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ది పాదయాత్ర కాదని, స్మశానయాత్ర అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానిని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే యాత్రగా భావిస్తున్నానని డిప్యూటీ సీఎం అన్నారు. పాదయాత్ర చేసి సమస్యలు పరిష్కరించాలి కానీ.. శిలాఫలాకాలను ధ్వంసం చేస్తున్నారని నారాయణ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇకపోతే.. నారా లోకేష్ టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, తెలుగు అకాడమీ ఛైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి . మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వార్డ్ మెంబర్గా కూడా గెలవలేని వ్యక్తి పాదయాత్ర చేస్తున్నాడంటూ చురకలంటించారు. ఫైబర్ నెట్ స్కాంలో దోపిడీకి పాల్పడ్డవాడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నాడని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెడితే ఆ యువ నాయకుడు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.
వందరూపాయల చీర, పుచ్చిపోయిన కందిపప్పు ఇస్తామని పిలిచి అమాయకుల ప్రాణాలు తీశారంటూ లక్ష్మీపార్వతి గుంటూరు తొక్కిసలాటను ప్రస్తావించారు. టీడీపీ నాయకులకు అంబేద్కర్ రాజ్యాంగం కాకుండా ప్రత్యేక రాజ్యాంగం వుందా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబులో పశ్చాత్తాపం లేదని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. కమ్యూనిస్ట్ నేతలు తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారని ఆమె ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుడు మార్గంలో వెళ్తున్నారని.. చంద్రబాబుతో కలిసి వెళ్తే ఆయనకు చివరికి మిగిలేది నష్టమేనని ఆమె వ్యాఖ్యానించారు.