ఏపిలో లాక్ డౌన్... విద్యార్థులకు వెసులుబాటు కల్పించిన విద్యాశాఖ
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంతో పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.
అమరావతి: కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ ను అమలుచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు, విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ పోటీ పరీక్షలకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేయాలనుకున్న విద్యార్థులు ఇబ్బందికి గురవుతున్నారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో వుంచుకుని ఆన్లైన్ దరఖాస్తుల గడువు పెంచుతూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
ఎంసెట్ దరఖాస్తులకు ఈనెల 29 చివరి తేదీ కాగా దాన్ని ఏప్రిల్ 5వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది. అలాగే ఈసెట్ కు ఏప్రిల్ 2 వరకే చివరి తేదీ వుండగా ఏప్రిల్ 9వరకు పొడిగించారు. ఐసెట్ కు ఏప్రిల్ 2 వరకే కాకుండా 9 వరకు పొడిగించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
ఏపీ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఏపీలో కరోనా పాజిటివ్ లక్షణాల కేసుల సంఖ్య ఏడుకు చేరింది. దీంతో టెన్త్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ నుండి జరగాల్సిన పదోతరగతి పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 31వ తేదీ నుండి ఏపీ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ను ఇదివరకే ప్రకటించారు.
రెండు వారాల పాటు పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ సర్కార్ తేల్చి చెప్పింది. ఈ నెల 31వ తేదీ తర్వాత సమీక్ష నిర్వహించి పరీక్షల నిర్వహణపై ప్రకటన చేయనున్నట్టు ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.ఇప్పటికే ఏపీ రాష్ట్రంలో విద్యా సంస్థలను మూసివేసింది.
ఈ నెల 23వ తేదీ నుండి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను పురస్కరించుకొని తొలుత పదోతరగతి పరీక్షలను వాయిదా వేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఈ నెల 23వ తేదీ నుండి ఈ నెల 31వ తేదీకి పదోతరగతి పరీక్షల షెడ్యూల్ ను మార్చారు. అయితే కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలు కూడ వాయిదా వేసింది ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం.
మరోవైపు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వాయిదా వేయాలని మంగళవారం నాడు విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది. సీఎం జగన్ తో సమావేశం తర్వాత ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సురేష్ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.