ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నుండి ప్రభుత్వ శాఖల తరలింపుపై స్టేటస్ కో కొనసాగుతుందని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని బిల్లుల ఉపసంహరణ కేసుపై ఇవాళ(సోమవారం) రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది. త్రిసభ్య ధర్మాసనం ఎదుట పిటిషనర్ల తరపున న్యాయవాదులు శ్యామ్‍దివాన్, సురేష్ వాదనలు వినిపించారు. అయితే వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లుల ఉపసంహరణపై గవర్నర్ ఇంకా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు... కాబట్టి గవర్నర్ నుంచి అనుమతి వచ్చిన తర్వాత రాజధాని పిటిషన్లపై విచారణ కొనసాగింపునకు ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణ డిసెంబర్ 27కు వాయిదా వేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇవాళ విచారణ సందర్భంగా ఉపసంహరణ బిల్లుల్లో కూడా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానులను తీసుకువస్తామని చెప్పిందని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని... మాస్టర్ ప్లాన్ కూడా అదే చెబుతుందని పిటిషనర్ తరపు లాయర్లు పేర్కొన్నారు. కాబట్టి ఈ పిటిషన్లపై విచారణ కొనసాగించాలని లాయర్లు న్యాయస్థానాన్ని కోరారు.

అయితే చట్టానికి లోబడి అభివృద్ధి చేసేందుకు ప్రతిబంధకంగా ఉన్న మధ్యంతర ఉత్తర్వులను తొలగిస్తున్నామని ap high court స్పష్టం చేసింది. ప్రస్తుతానికి ప్రభుత్వ శాఖల తరలింపుపై ఉన్న స్టేటస్‍కో ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. విచారణను డిసెంబర్ 27కు వాయిదా వేసింది.

read more AP Capital issue: అమరావతి రైతుల రాజధాని కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిదీ.. హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు..

ఇటీవల పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ బిల్లులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంతో అమరావతి రైతులు, మహిళలు ఆనందించారు. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వైసిపి ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో మూడు రాజధానుల ప్రస్తావన తేవడం.. మళ్లీ బిల్లులను ప్రవేశ పెడతామని చెప్పడంతో పరిస్థితి మొదటికి వచ్చింది.

తాజాగా రాజధానిపై విచారణను కొనసాగించాలని పిటిషనర్లు కోరగా బిల్లుల ఉపసంహరణపై గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత తిరిగి విచారిస్తామని న్యాయస్థానం తెలిపింది. గెజిట్ విడుదల అనంతరం హైకోర్టు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

ఇదివరకు కూడా రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి కోసం దాదాపు 30 వేల మంది రైతులు స్వచ్ఛంగా భూములు ఇచ్చారన్నారు. కాబట్టి అమరావతి కేవలం రైతుల రాజధాని అనడం పొరపాటని... ఏపీ ప్రజలందరి రాజధాని అని వ్యాఖ్యానించారు.

read more AP CAPITAL ISSUE: అమరావతిని అలా చూడాలన్నదే జగన్ కోరిక... ఇంతకు ఇంతా అనుభవిస్తారు.: సోమిరెడ్డి ధ్వజం

ఏపీ రాజధాని అంటే కర్నూలు, వైజాగ్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల రాజధాని అని సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఈ అంశాన్ని స్వాతంత్ర్య పోరాటంతో పోల్చారు. స్వాతంత్ర్య సమరయోధులు స్వాతంత్ర్యం కోసం పోరాడడం అంటే కేవలం వారి కోసం పోరాడలేదని... దేశ ప్రజలందరి కోసం పోరాడారని అన్నారు. ఆ స్వాతంత్ర్యం కేవలం సమరయోధులకు సంబంధించినది మాత్రమే కాదని, దేశ ప్రజలందరికీ చెందినదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మిశ్రా స్పష్టం చేశారు.