బిగ్ బాస్ రియాల్టీ షోను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి పలువురికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

బిగ్ బాస్ రియాల్టీ షోను నిలిపివేయాలని దాఖలైన పిటిషన్‌పై నేడు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు విచారణ చేపట్టింది. అంతకుముందు విచారణలో భాగంగా.. బిగ్ బాస్ తెలుగు షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను చూస్తామని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పిటిషన్‌పై తదుపరి విచారణను నేటికి(అక్టోబర్ 27) వాయిదా వేసింది. నేడు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇందుకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బిగ్ బాస్ షో నిర్వాహకులు, హోస్ట్ అక్కినేని నాగార్జునకు ఏపీ హైకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని నోటీసుల్లో పేర్కొంది. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ యువతను తప్పుదోవ పట్టించడంతోపాటు అసభ్యత, అనైతికం, హింసను ప్రోత్సహిస్తోందని, బిగ్ బాస్ ప్రసారాన్ని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సామాజిక కార్యకర్త కె జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ రియాల్టీ షోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాన్ని వీక్షిస్తామని హైకోర్టు పేర్కొంది. సెన్సార్‌షిప్ లేకుండా ప్రసారం చేస్తున్నారనే పిటిషనర్ వాదన నేపథ్యంలో షో యొక్క టెలికాస్ట్ వివరాలను కోరిన ధర్మాసనం.. కనీసం రెండు లేదా మూడు ఎపిసోడ్‌లను చూస్తామని తెలిపింది. ఈ షో ప్రదర్శన వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది.