అన్నీ గమనిస్తున్నాం: జగన్ సర్కార్పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విజయవాడకు చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లంటి లోచిని పిటిషన్లపై జస్టిస్ రాకేష్ కుమార్ బెంచ్ వాదనలు విన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న వివిధ పరిణామాలను తాము గమనిస్తున్నామని, రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా..? లేదా అనే అంశంపై విచారించి.. న్యాయస్థానాలు ఉత్తర్వులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అని హైకోర్టు ప్రశ్నించింది.
న్యాయపరమైన అవకాశాలను పరిశీలించి తమకు తెలియచేయాలని, పిటిషనర్ తరపున న్యాయవాది రవితేజను ధర్మాసనం ఆదేశించింది. మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది శాసనమండలిలో వ్యతిరేకిస్తే.. శాసనమండలి రద్దుకు సిఫారుసు చేసిన విధానం తమ దృష్టిలో ఉందని న్యాయస్థానం పేర్కొంది.
రాష్ట్రంలో దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగ్స్పై రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా సీరియస్గా తీసుకోకపోవడం గమనించామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు కూడా ఈ విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రెడ్డి గౌతమ్, లోచిని హెబియస్ కార్పస్ పిటిషన్పై న్యాయ విచారణ విధానాన్ని తప్పుబట్టడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.