రిటైర్డ్ ఐఎఎస్ ఉదయలక్ష్మికి హైకోర్టు షాక్: నాన్బెయిలబుల్ వారంట్ జారీ
రిటైర్డ్ ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మికి ఏపీ హైకోర్టు కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను మంగళవారం నాడు జారీ చేసింది.
అమరావతి: రిటైర్డ్ ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మికి ఏపీ హైకోర్టు కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ ను మంగళవారం నాడు జారీ చేసింది. సర్వీస్ రూల్స్ అమలుపై హైకోర్టు ఆదేశాలు అమలు చేయలేదని కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఆమె కనీసం సంజాయిషీ కూడ ఇవ్వలేదు. దీంతో హైకోర్టు ఆమెకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. రాజమండ్రికి చెందిన పీఈటీ రత్నకుమార్ గతంలో తనకు అన్యాయం జరిగిందని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం పీఈటీ రత్నకుమార్ కు న్యాయం చేయాలని ఆదేశించింది.
ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గా ఉన్న సమయంలో ఉదయలక్ష్మి ఈ ఆదేశాలను పట్టించుకోలేదని బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయాన్ని కోర్టు ధిక్కరణగా పేర్కొంది. ఉన్నత విద్యాశాఖ కమిషనర్ ఉదయలక్ష్మిని కోర్టులో హాజరుపర్చాలని గుంటూరు ఎస్పీని ఆదేశించింది హైకోర్టు. మరో వైపు ఇదే కేసులో కౌంటర్ దాఖలు చేయాలని గతంలో విద్యాశాఖలో పనిచేసి ప్రస్తుతం సీఎస్ గా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ ను ఆదేశించింది హైకోర్టు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది ఉన్నత న్యాయస్థానం.