వినుకొండ ఎమ్మెల్యే, మున్సిపల్ కమీషనర్ పై హైకోర్టు సీరియస్... కోర్టు దిక్కరణ నోటీసులు
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడితో పాటు మున్సిపల్ కమీషనర్ కు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
గుంటూరు: అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వినుకొండ పట్టణంలోని సురేష్ మహల్ రోడ్డులో ఆక్రమణల తొలగింపుతో నష్టపోయిన బాధితులు కోర్టును ఆశ్రయించారు. బాధితుల పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ముందస్తు నోటీసులు లేకుండా అర్దాంతరంగా కూల్చివేయడాన్ని తప్పుబట్టింది. ఈ క్రమంలోనే స్థానిక ఎమ్మెల్యేతో పాటు వినుకొండ మున్సిపల్ కమిషనర్ కు కోర్టు దిక్కరణ నోటీసులు జారీ చేశారు.
ఇదిలావుంటే ఇటీవల టీడీపీ, వైసీపీ ల మధ్య సవాళ్ళు ప్రతిసవాళ్లతో వినుకొండ వార్తల్లో నిలిచింది. స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వచ్చంధ సంస్థకు విదేశాల నుండి నిధులు వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆరోపించారు. ఆంజనేయులుకు చెందిన స్వచ్ఛంధ సంస్థకే ఎన్నారైల నుండి నిధులు వస్తున్నాయని బ్రహ్మనాయుడు ఆరోపించారు. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడమే కాదు కోటప్పకొండ సాక్షిగా ప్రమాణం చేయాలంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లకు దిగారు.