దేవాదాయ అధికారులపై హైకోర్ట్ సీరియస్... కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ
పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, ద్వారకా తిరుమల ఈవోకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.
అమరావతి: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన దేవదాయశాఖ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది ఏపీ హైకోర్టు. దేవదాయ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, ద్వారకా తిరుమల ఈవోకు హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.
గతంలో తమకు 27శాతం మధ్యంతర భృతి అమలు చేయడం లేదంటూ హైకోర్టులో ఎన్ఎంఆర్లు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర భృతి అమలు చేయాలని డిసెంబర్లో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పటివరకూ కోర్టు ఉత్తర్వులను దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయడం లేదు. దీంతో బాధితులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది.
read more నీటి హక్కులను తాకట్టు పెట్టొద్దు: జగన్కు చంద్రబాబు హితవు
ఇటీవల కోర్టు ధిక్కరణ నేరంపై ఇద్దరు ఐఏఎస్లకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. కోర్ట్ ధిక్కార నేరం కింద ఐఏఎస్ లు చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్లకు వారం పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్వర్వులను అమలు చేస్తామని ప్రభుత్వం తరఫు న్యాయవాది న్యాయస్థానానికి లిఖితపూర్వక హామీనివ్వడంతొ అధికారుల జైలు శిక్షను హైకోర్టు రీకాల్ చేసింది.
ఈ సమయంలోనే అధికారులు ఈ జైలుశిక్ష తీర్పును హెచ్చరికగా పరిగణించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయినప్పటికి దేవాదాయ శాఖ అధికారులు కోర్టు ఆదేశాలను పాటించడంలో అలసత్వం వహించారు. దీంతో వారికి న్యాయస్థానం ధిక్కరణ నోటీసులు జారీ చేశారు.