ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తలను విజయవాడలోనే పెట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తల తరలింపుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది

ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తలను విజయవాడలోనే పెట్టాలంటూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌హెచ్చార్సీ, లోకాయుక్తల తరలింపుపై స్టేకు హైకోర్టు నిరాకరించింది. గతంలో వేసిన ఇలాంటి పిటిషన్‌పై విచారణలో భాగంగా కౌంటర్‌దాఖలు చేశామని ఏజీ కోర్టుకు తెలిపారు. గతంలో హైక్టోర్టుకు చెప్పిన విధంగా లోకాయుక్తపై గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ అయ్యిందన్న ఏజీ కర్నూలులో కూడా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని వివరించారు.

రాష్ట్ర విభజన తర్వాత రెండు సంస్థలు కూడా హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని ఏజీ గుర్తుచేశారు. లోకాయుక్త ఇన్వెస్టిగేటివ్‌ రూల్స్‌ హైదరాబాద్‌లో నోటిఫై చేశారని, ఇప్పుడు ఆ నియమాలను సవరించాలని ఏజీ కోర్టుకు తెలిపారు. అమరావతి ప్రాంతంలో ఎస్‌హెచ్సార్సీ లేకుండానే 2017లో పేపరు మీద నామమాత్రంగా నోటిఫికేషన్‌ జారీచేశారని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ప్రభుత్వం వీటన్నింటినీ సవరించిందని ఏజీ కోర్టుకు వివరించారు.

ఈ రెండు సంస్థలూ అమరావతిలోనే ఉండాలన్న పిటిషనర్‌కు ఎలాంటి హక్కు లేదని విధించారు. అయితే కనీసం ఎస్‌హెచ్చార్సీని తరలించకుండా స్టే విధించాలన్న పిటిషనర్‌ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న న్యాయస్థానం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. అలాగే ఈ కేసులో కేబినెట్‌ మంత్రులను పార్టీగా చేయాలన్న పిటిషనర్‌ వాదననూ తోసిపుచ్చింది. దీనిలో భాగంగా నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు అంగీకరించలేదు. అయితే వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి నోటీసులు ఇవ్వాలన్న పిటిషనర్‌ కోరారు. ఈ అభ్యర్థనను సైతం న్యాయస్థానం తోసిపుచ్చింది. తుది ఉత్తర్వులకు లోబడే ఏదైనా ఉంటుందని చెబుతూ.. విచారణను 5 వారాలకు వాయిదా వేసింది.