జగన్ ప్రభుత్వంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టు ధిక్కరణ కేసు క్లోజ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఏపీ ఎన్నికల కమిషనర్ (ఏపీ ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సహకరించకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించిందన, నిధులు కూడా విడుదల చేసిందని ఏపీ ఎస్ఈసీ హైకోర్టుకు తెలియజేసింది. అందువల్ల కేసును క్లోజ్ చేయాలని కూడా కోరింది. దీంతో హైకోర్టు కేసును క్లోజ్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వైఎస్ జగన్ ప్రభుత్వం తొలుత అసలు ఇష్టపడలేదు. ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేస్తూ వచ్చిన ప్రయత్నాలు పలు విధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ స్థితిలో నమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరించడానికి ముందుకు వచ్చింది. దీంతో ఆయన గ్రామ పంచాయతీ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను నిర్వహించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను మాత్రమే కొనసాగించలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్థానంలో కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని నియమితులయ్యారు.