ఏపీ సర్కార్ పరిమితికి మించి చేసిన అప్పు ఎంతంటే... రాజ్యసభలో కేంద్రం ప్రకటన
వైఎస్ జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది పరిమితికి మించి రూ.4 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్ధిక శాఖ తెలిపింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాదిలో పరిమితికి మించి రు.4 వేల కోట్లకు పైగా అప్పులు చేసిందని కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంట్లో ప్రకటించింది. 2020-21 ఆర్థిక సంత్సరానికిగాను రు.54,369.18 కోట్లు ఆర్థిక లోటుగా రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్లో స్పష్టం చేసిందని వెల్లడించింది. ఈ మేరకు రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
15వ ఆర్థిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 30,305 కోట్లు, కొవిడ్ కారణంగా మరో రూ. 19,192 కోట్లు అప్పు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వానికి అవకాశం కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. మొత్తంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి రు. 49,497 కోట్లు అప్పు పొందేందుకు అవకాశం కల్పించినట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి వివరించారు.
ఇక ఏపీ నుంచి ‘దిశ’పై ఎలాంటి స్పందన రాలేదని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. రాష్ట్రం పంపిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలపై వివరణ కోరినట్లు తెలిపింది. అయితే దీనిపై ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు వైసీపీ ఎంపీ మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.