మండౌస్ తుఫాను బాధితులకు ఆర్ధిక సాయం విడుదల .. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
మండౌస్ తుఫాను కారణంతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా ప్రతి వ్యక్తికి రూ. వెయ్యి చొప్పున, కుటుంబానికి గరిష్టంగా రూ. 2 వేల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించిం
మండౌస్ తుఫాను కారణంతో తీవ్రంగా నష్టపోయిన బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక సాయం విడుదల చేసింది. ప్రతి వ్యక్తికి రూ. వెయ్యి చొప్పున, కుటుంబానికి గరిష్టంగా రూ. 2 వేల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించింది. ప్రస్తుతం పునరావాస కేంద్రాలలో ఆశ్రయం పొందుతున్న బాధితులు ... ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు ఈ ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమైన నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లోని బాధితులకు ఆర్ధిక సాయం అందించాలని ప్రభుత్వం సూచించింది.
మరోవైపు... తుఫాను కారణంగా నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం ద్వారా పంట నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు కోరారు. వర్షానికి తడిసిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ALso REad:మాండౌస్ తుఫాను ఎఫెక్ట్ : తిరుపతిలో 24 గంటల్లో 158.9 సగటు వర్షపాతం నమోదు
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కడప జిల్లా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 64 మంది ప్రాణాలు కోల్పోయారని, వేలాది ఇళ్లు, వందలాది ఎకరాల్లో పంట నాశనమైందని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. రైతుల సంక్షేమాన్ని జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆయన ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
కాగా... డిసెంబర్ 13 నాటికి దక్షిణ అండమాన్ సముద్రంలో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆదివారం తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 13-14 తేదీలలో అండమాన్, నికోబార్లో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే డిసెంబర్ మధ్య నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఓ నివేదిక సూచించింది. అయితే తుఫాన్గా మారే అవకాశం లేదు.
ఇదిలావుండగా.. పొరుగున ఉన్న తమిళనాడులోని మామల్లపురంలో ఆదివారం రాత్రి 'మండౌస్' తుఫాను తీరాన్ని దాటిన తరువాత తాజా సమాచారం అందింది. మండౌస్ తుఫాను అవశేషాలు అల్పపీడన ప్రాంతంలోకి ప్రవేశించాయని ఐఎండీ ఆదివారం తెలియజేసింది. అల్పపీడన ద్రోణి (మాండూస్ తుఫాను అవశేషం) ఉత్తర తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది.