Asianet News TeluguAsianet News Telugu

జగన్ సర్కార్ కీలక ఉత్వర్వులు.. ఆ కుటుంబాలకు రూ.50 వేలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌ మృతుల (Covid deaths) కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు అందజేయనున్నారు.

AP Govt orders to provide rs 50000 Compensation for Families Of COVID Deaths
Author
Amaravati, First Published Oct 26, 2021, 11:58 AM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతం చేసిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. వారి కుటుంబాలు చాలా దారుణంగా నష్టపోయాయి. సంపాదన లేక ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురుచూస్తున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా మృతిచెందిన వారి కుటుంబాలకు రూ. 50 ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) కోవిడ్‌ మృతుల (Covid deaths) కుటుంబాలకు పరిహారం చెల్లింపుపై వైఎస్ జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసింది. దరఖాస్తు నమునాను కూడా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి చెల్లించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లింపులకు సంబంధించి కలెక్టరేట్‌లో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని సూచనలు చేసింది. మృతుల జాబితా రూపొందించి చెల్లింపులు చేయాలని పేర్కొంది. దరఖాస్తు కోసం వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రొఫార్మా రూపొందించింది. దరఖాస్తు స్వీకరించినట్లు ఓ రసీదు, దానికి ప్రత్యేక నంబర్ కూడా ఇస్తారు. దరఖాస్తు స్వీకరించిన 2 వారాల్లోగా పరిహారం చెల్లింపు చేపట్టాలి. ప్రత్యేక నెంబర్ ఆధారంగా చెల్లింపులు జరగనున్నాయి. 

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
-జిల్లా స్దాయిలో కోవిడ్ మృతుల నిర్ధారణ కమిటీలు(సీడాక్) నుంచి సర్టిఫికేట్ తీసుకోవాలి. 

-దరఖాస్తులో పేరు, మృతుడితో బంధుత్వం, చనిపోయిన ప్రదేశం, దరఖాస్తుదారుడి చిరునామా, ఆధార్‌ నెంబరు, ఆధార్‌ లింక్‌ అయిన బ్యాంకు అకౌంట్‌ వివరాలు, మరణ ధ్రువీకరణపత్రం, సీడాక్ ఆమోదించిన నెంబరుని నింపాలి.

-దరఖాస్తుతో పాటు స్థానిక రిజిస్ట్రార్‌ మంజూరు చేసిన మరణ ధ్రువీకరణపత్రం, సీడాక్ సర్టిఫికేట్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌, బ్యాంకు అకౌంట్‌ కాపీ, తహసీల్దారు జారీ చేసిన ఫ్యామిలీ మెంబరు సర్టిఫికెట్‌ కాపీలను జత చేయాలి.

-దరఖాస్తుపై ఆశ వర్కర్‌, ఏఎన్‌ఎం, మెడికల్‌ ఆఫీసర్‌ కూడా కౌంటర్‌ సంతకం చేయాల్సి ఉంటుంది. చివరిగా డీఆర్‌వో సంతకం చేసి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. 

-కొవిడ్‌ మృతుల కుటుంబంలో వారి తర్వాత ఎవరైతే ఉంటారో వారికే ఈ నష్టపరిహారం చెల్లిస్తారు. 

Follow Us:
Download App:
  • android
  • ios