ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, భూ సేకరణ పథకం లే అవుట్ల అభివృద్ధి పనులకు మొదటి దశలో రూ. 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు గాను అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఏపీ ప్రభుత్వం అనుమతించింది

ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, భూ సేకరణ పథకం లే అవుట్ల అభివృద్ధి పనులకు మొదటి దశలో రూ. 3వేల కోట్ల రుణం తీసుకునేందుకు గాను అమరావతి మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి ఏపీ ప్రభుత్వం అనుమతించింది.

వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి రూ. 3వేల కోట్ల మేర బ్యాంక్ రుణాలు తెచ్చుకునేందుకు వెసులాబాటు కల్పించింది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో మొదటి దశలో ప్రాధాన్య క్రమంలో మౌలిక వసతులు, ల్యాండ్ పూలింగ్ పథకం కింద చేపట్టాల్సిన పనులకు ఆమోదం లభించింది.

అలాగే ఏఎంఆర్డీయే పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టేందుకు బ్యాంక్ రుణాల కోసం.. బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది.

బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్‌లు రూ. వెయ్యి కోట్ల చొప్పున రుణం ఇచ్చేందుకు అంగీకరించినట్లు ఏఎంఆర్డీయే కమిషనర్ ప్రభుత్వానికి తెలియజేశారు.

అయితే రుణానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం రుణంతో పాటు వడ్డీ కూడా అమరావతి మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీనే చెల్లించుకోవాలని పేర్కొంది.

అమరావతి అభివృద్ధికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం వేసిన అంచనా వ్యయం రూ. 29.282 కోట్లను తమ ప్రభుత్వం భరించలేదని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఈ మొత్తాన్ని మూడో వంతుకు తగ్గించింది.

ఇందుకు తగినట్టుగా వ్యయాన్ని రూ. 11.098 కోట్లకు కుదిస్తూ ఏఎంఆర్డీయే ఇప్పటికే అంచనాలను సవరించింది. ఈ మొత్తంలో రూ. 10వేల కోట్లకు ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే రుణంగా ఇస్తామని మూడు ప్రభుత్వరంగ బ్యాంకులతో కూడిన కన్సార్షియం స్పష్టం చేసింది. అయితే ఇంత మొత్తం ఒకేసారి కాకుండా మూడు దశల్లో విడుదల చేస్తామని స్పష్టం చేసింది.