40 ఇయర్స్ ఇండస్ట్రీకి కోపమొచ్చింది... పవన్లా చెప్పు చూపించాలని ఉందేమో : బాబుపై సజ్జల వ్యాఖ్యలు
కర్నూలు జిల్లా పర్యటనలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పవన్ కల్యాణ్లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక వున్నట్లుందని ఆయన సెటైర్లు వేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను ప్రజలు చూశారని సెటైర్లు వేశారు. 40 ఏళ్ల ఇండస్ట్రీకి అంత కోపం ఎందుకు వచ్చిందని సజ్జల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్లా బాబుకు కూడా చెప్పు చూపించాలనే కోరిక వున్నట్లుందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతిలోనే రాజధాని ఎందుకు ఉండాలనే దానిపై బాబు సమాధానం చెప్పాలని సజ్జల ప్రశ్నించారు. వికేంద్రీకరణపై చంద్రబాబు ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
న్యాయ రాజధానిపై మీ వైఖరేంటని అడిగితే బాబు సమాధానం చెప్పలేదని.. పైగా ఎదురు దాడి చేశారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా అని రామకృష్ణారెడ్డి నిలదీశారు. ప్రజల ప్రశ్నలను డైవర్ట్ చేయడానికే బాబు తిట్ల పురాణం మొదలుపట్టారని ఆయన ఆరోపించారు. ప్రజలను, పోలీసులను తిడుతున్నారని.. నాశనమైపోతారని శాపనార్ధాలు పెడతారని సజ్జల దుయ్యబట్టారు. అధికారం తనకు హక్కు అయినట్టు మాట్లాడుతున్నారని.. రౌడీలకు రౌడీనని ఎలా అంటారని రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు ఆ బరి తెగింపు ఎందుకని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read:వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే.. ఆంధ్రప్రదేశ్ను ఎవరూ కాపాడలేరు: చంద్రబాబు
అంతకుముందు శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆ పార్టీ రూపొందించి ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాళ్లేస్తే భయపడే పార్టీ టీడీపీ కాదని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎన్నో దాడులు జరిగాయని.. ఇవన్నీ పోలీసుల సహకారంతో ప్రభుత్వమే చేసిందని ఆరోపించారు.
అధికార పార్టీకి చెందిన ఓ ఫ్లెక్సీ తగలగడితే పోలీసులు డాగ్స్ను రంగంలోకి దించారని.. తునిలో టీడీపీ నేత మీద హత్యాయత్నం జరిగితే పోలీసులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తనపై పూలు వేస్తే.. అందులో రాళ్లున్నాయని పోలీసులు చెబుతున్నారని అన్నారు. రేపు అవే పూలల్లో బాంబు ఉందని అంటారా? అని పోలీసులపై మండిపడ్డారు. తన మీద రాళ్లేస్తే తాను భయపడి పర్యటనలు చేయకూడదని ప్రభుత్వ ఉద్దేశం అని విమర్శించారు.
అచ్చెన్నాయుడును వేధించడంతో ప్రభుత్వం దారుణాలకు తెర లేపిందని అన్నారు. ఎంపీ రఘురామకృష్ణం రాజును పోలీస్ కస్టడీలో ఉండగానే చంపే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కోర్టులు తప్పు పట్టినా ప్రభుత్వం భయపడ లేదని అన్నారు. ఇవాళే కాదు.. రేపు కూడా ఉంటుందని పోలీసులు గుర్తుంచుకోవాలని అన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలతో గెలిచిన అధికార పార్టీ నేతలకు కొవ్వెక్కిందని విమర్శించారు. ప్రతి సందర్భంలోనూ ప్రజలను.. ప్రతిపక్షాలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.