చర్చలకు రమ్మంటే .. రావాలి కదా, సమస్య ఇంకా పెద్దదవుతోంది : ఉద్యోగ సంఘాలపై సజ్జల అసహనం
పీఆర్సీ వివాదానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడంపై ప్రభుత్వం తరపు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) స్పందించారు
పీఆర్సీ వివాదానికి సంబంధించి ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడంపై ప్రభుత్వం తరపు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy) స్పందించారు. చర్చలకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించినా, ఉద్యోగులు ముందుకు రాకపోవడం సరికాదన్నారు. ఉద్యోగుల్లో అపోహలు మరింత పెరగకూడదనే ప్రభుత్వం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసిందని సజ్జల గుర్తుచేశారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన హితవు పలికారు.
ఇవాళ కొన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ వద్దకు వచ్చారని, తమ సమస్యలను వివరించారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వారు ప్రస్తావించిన అంశాలను నోట్ చేసుకున్నామని, వాటిపై చర్చిస్తామని వారికి తెలిపినట్టు ఆయన వెల్లడించారు. మిగిలిన ఉద్యోగ సంఘాలకు చెందినవారు కూడా రావాలని సజ్జల విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఉద్యోగ సంఘాలు ఫిబ్రవరి 3న లక్షమందితో 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పట్టుదలతో వున్నారు.
మరోవైపు PRC సాధన సమితితో చర్చల కోసం ఎదురు చూపులుండవని ఏపీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు అమరావతిలో Botsa Satyanarayana మీడియాతో మాట్లాడారు. Employees Unionsతో చర్చించేందుకు తాము నాలుగు మెట్లు దిగడానికి కూడా సిద్దంగా ఉన్నామని ప్రభుత్వ సలహాదారు Sajjala Ramakrishna Reddy వ్యాఖ్యలను అలుసు తీసుకొన్నారని మంత్రి మండిపడ్డారు. ఉద్యోగ సంఘాలు ముందుకు వస్తేనే చర్చలుంటాయని ఆయన తేల్చి చెప్పారు. చర్చల కోసం ఉద్యోగ సంఘాల కోసం ఎదరు చూపులుండవని ఆయన స్పష్టం చేశారు. మీ పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని ఆయన ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమేననే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త పీఆర్సీ ప్రకారంగా ఏ ఒక్కరికి కూడా రూపాయి తగ్గదని మంత్రి తెలిపారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని బొత్స సత్యనారాయణ కోరారు. మనలో మనం ఘర్షణ పడొద్దని మంత్రి సూచించారు. జీతాలు పెరుగుతున్నాయో తగ్గుతున్నాయో ఒకటో తేదీన వచ్చే పే స్లిప్ లో తెలుస్తాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. కానీ జీతాలు వద్దని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయన్నారు.ఉద్యోగ సంఘాలు ఏమనుకొంటున్నాయో అర్ధం కావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం ఓపెన్ మైండ్ తో ఉందన్నారు. సీనియర్ మంత్రులు వచ్చి కూర్చోన్నా కూడా ఉద్యోగ సంఘాలు చర్చలకు రాకపోవడం బాధాకరమన్నారు.