కరోనా నేపథ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆన్‌లైన్ విధానంలో ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించారు. అయితే రేపు మాత్రం తొలిసారిగా సభకు వచ్చి సభ్యులనుఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

రేపటి నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ (ap assembly budget session 2022) సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సభలో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ (biswabhusan harichandan) బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి శాసనసభకు హాజరు కానున్నారు. కరోనా నేపథ్యంలో గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ఆన్‌లైన్ విధానంలో ఉభయసభలను ఉద్ధేశించి ప్రసంగించగా ఈ విడత ఆయన నేరుగా సభకు వచ్చి సభ్యులనుఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా నేతృత్వంలో ఆదివారం రాజ్ భవన్ అధికారులు పూర్తి స్ధాయి ట్రయల్ రన్ ను నిర్వహించారు. విజయవాడ రాజ్ భవన్ నుండి గవర్నర్ శాసనసభకు చేరుకునే మార్గం, శాసనసభలో ఏ గేటు నుండి కాన్వాయ్ లోపలికి ప్రవేశిస్తుంది, గవర్నర్‌కు ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి (ys jagan ) , శాసస సభ స్పీకర్, శాసన పరిషత్తుఛైర్మన్ తదితరులు ఎక్కడ స్వాగతం పలుకుతారు. గౌరవ వందనం స్వీకరించే ప్రదేశం ఇలా అన్ని విషయాలను శాసనసభ కార్యదర్శి బాలకృష్ణామాచార్యులు నుండి సిసోడియా అడిగి తెలుసుకున్నారు.

సభ్యులందరికీ గవర్నర్ స్పష్టంగా కనిపించేలా సభలో పోడియం ఎంతఎత్తులో ఉండాలి, దీనికి అవసరమైన ఏర్పాట్లు, గవర్నర్ ప్రసంగం కొనసాగుతున్న సమయంలోరాజ్ భవన్ అధికారులు వేచి ఉండే ప్రదేశం, ప్రసంగం తరువాత తిరిగి గవర్నర్ రాజ్ భవన్ చేరుకోవటం ఇలా ప్రతి విషయాన్ని శాసనసభ కార్యదర్శి రాజ్‌భవన్ అధికారులకు వివరించారు. సమాచార లోపం లేకుండా సమన్వయంతో వ్యవహరించి, కార్యక్రమాన్ని పూర్తిచేయాలని ఈ సందర్భంగా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసొడియాఅధికారులను ఆదేశించారు.

మార్చి 7వ తేదీన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. మార్చి 8న ఇటీవల గుండెపోటుతో మరణించిన పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి అసెంబ్లీ సంతాప తీర్మానం చేసి నివాళులర్పించనుంది. మార్చి 11న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 7వ తేదీన అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 

ఇక, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి దంపతులు రాజ్‌భవన్‌లో సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు అరగంట పాటు పలు అంశాలపై గవర్నర్‌, సీఎం చర్చించారు. త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ దృష్టికి తీసుకువచ్చి ఆయన అనుమతి తీసుకున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. అలాగే ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్ విభజన ప్రక్రియ గురించి గవర్నర్ బిశ్వ భూషణ్‌కు సీఎం జగన్ వివరించారు. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా జిల్లాల పునర్ విభజన జరుగుతుందని, ప్రజల నుండి వినతులను స్వీకరించి ఆమోద యోగ్యమైన రీతిలో నూతన జిల్లాలను ఆవిష్కరించనున్నామని తెలిపారు