ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే... ప్రతి ఒక్కరు ఇలా చేయండి: ఏపి గవర్నర్ సూచన
జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు.
విజయవాడ: జూన్ 21 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలు యోగాను నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషన్ హరిచందన్ పిలుపునిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన కామన్ యోగా ప్రోటోకాల్ (సివైపి) ను అనుసరించి జూన్ 21 ఉదయం 7 గంటల నుండి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్ పేరుతో రాజ్ భవన్ ఓ సందేశాన్ని విడుదల చేశారు
"యోగా అనేది మన దేశంలో ఉద్భవించిన 5,000 సంవత్సరాల పురాతన సాంప్రదాయం. ఇది శరీరం, మనస్సుల నడుమ సమన్వయం సాధించడానికి ఉపయోగపడి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక సాధనలను మిళితం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనల మేరకు 2014 డిసెంబర్ 11న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది ఎంతో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది'' అని తెలిపారు.
read more ఐదు రోజుల పనిదినాలు... ప్రభుత్వ నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల్లో ఉత్కంఠ
''అంతర్జాతీయ యోగా దినోత్సవం -2020 యొక్క ఇతివృత్తం ‘ఘర్ ఘర్ మే యోగ్’.ఇది సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇంట్లో ఉండడం, కుటుంబ సభ్యులతో కలిసి యోగా సాధన చేయడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఇంట్లో ఉండడం ద్వారా మనతో పాటు మన కుటుంబ సభ్యులను కరోనా వైరస్ నుండి దూరంగా ఉంచుకో గలుగుతాము. యోగా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ఇంట్లో ఉండండి, సురక్షితంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి'' అంటూ గవర్నర్ పేరుతో రాజ్ భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది.