ఆగష్టు 16 నుండి ఏపీలో స్కూల్స్ ప్రారంభం: జగన్ కీలక నిర్ణయం
ఏపీలో ఆగష్టు 16 నుండి స్కూల్స్ తెరవాలని జగన్ సర్కార్ ఇవాళ నిర్ణయం తీసుకొంది. ఏపీలో విద్యాశాఖపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. నాడు నేడు కార్యక్రమానికి కూడ అదే రోజున ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నూతన విద్యావిధానంపై కూడ ప్రభుత్వం అదే రోజున స్పష్టత ఇవ్వనుంది.
అమరావతి: ఈ ఏడాది ఆగష్టు 16వ తేదీ నుండి స్కూల్స్ ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకొంది.విద్యార్థులకు విద్యాకానుక కిట్స్ ను అందజేయాలని కూడ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. స్కూల్స్ రీ ఓపెన్ విషయమై ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలను వెల్లడించనుంది. మరో వైపు కొన్ని తరగతులను ఉదయం పూట, మరికొన్ని తరగతులను మధ్యాహ్నంపూట నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
శుక్రవారం నాడు విద్యాశాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. పాఠశాలలు పున:ప్రారంభించే రోజునే రెండో విడత నాడు నేడు పనులకు కూడ శ్రీకారం చుట్టాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకొన్నారు. కరోనా కేసులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్కూల్స్ ఓపెన్ చేయాలని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా సూచించారు.దాదాపు ఏడాదిన్నరగా విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకే పరిమితమయ్యారు.ఆన్లైన్ క్లాసుల కంటే భౌతికంగా విద్యార్థులు క్లాసులకు హాజరైతేనే ప్రయోజనమనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి. అయితే స్కూల్స్ రీఓపెన్ చేసే సమయంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.