బుడా నుంచి నాలుగు మండలాలు తొలగింపు... వైసిపి సర్కార్ కీలక నిర్ణయం
బుడా పరిధి నుంచి కురుపాం, గురుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలను తొలగిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: విజయనగరం జిల్లాలోని బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(బుడా) నుంచి నాలుగు మండలాలను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుడా పరిధి నుంచి కురుపాం, గురుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలను తొలగిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా నాలుగు మండలాల తొలగింపుతో బుడా పరిధి 2,247 చ.కి.మీలకు తగ్గింది.
మొదట్లో బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీలు, 11 మండలాలలో 572 పంచాయితీలను కలుపుతూ బొబ్బిలి కేంద్రంగా బుడా అప్పట్లో ఏర్పాటైన విషయం తెలిసిందే. 2011 జనాభా ప్రకారం 7,52,107 జనాభాతో 2247.67 చదరపు కిలోమీటర్ల పరిధిలో బుడా ఆవిర్భవించింది.
అయితే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2019లో బొబ్బిలి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ విషయంలో జారీ చేసిన జీవోకు అనుగుణంగా మరికొన్ని మండలాలను చేర్చుతూ గతేడాది వైసిపి ప్రభుత్వం మరో జీవో నెం.193 ఇచ్చింది. తెర్లాం, బలిజిపేట, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం మండలాలకు చెందిన 169 పంచాయతీలను బుడా పరిధిలో చేర్చారు. తాజాగా నాలుగు మండలాలు తొలగించడంతో పదమూడు మండలాలు, 656 గ్రామాలతో బుడా పరిధి తగ్గింది.