నకిలీ చలాన్ల కుంభకోణం: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నకిలీ చలాన్ల కుంభకోణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు రికవరీ కానీ ఆస్తులపై రిమార్క్లు చూపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నకిలీ చలాన్ల కుంభకోణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డబ్బులు రికవరీ కానీ ఆస్తులపై రిమార్క్లు చూపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయంటూ రికవరీ కాని ఆస్తులను ఎంకబెరెన్స్లో చూపెడుతోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోరూ.8 కోట్లకు పైగా నిధులు గోల్మాల్ అయినట్లు అధికారుల విచారణలో తేలింది. ఇప్పటి వరకు రూ.5 కోట్ల మేర రికవరీ జరిగినట్లు గుర్తించారు. నకిలీ చలానాల స్కాంలో ఇప్పటి వరకు 14 మంది సబ్ రిజిస్ట్రార్లపై చర్యలు చేపట్టారు.
మరోవైపు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగు చూడడంతో ఇతర శాఖలపై కూడ ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. పలు శాఖలకు చలాన్ల ద్వారా జమ చేస్తున్న నగదు చేరుతోందా లేదా అనే విషయమై ప్రభుత్వం పలు శాఖల్లో తనిఖీలు నిర్వహిస్తోంది.
చలాన్ల ద్వారా చెల్లిస్తున్న సీఎఫ్ఎంఎస్కి జమ అవుతోందా లేదా అనే అంశంపై అధికారులు కూపీ లాగుతున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో సుమారు రూ. 8 కోట్ల మేరకు అక్రమాలు జరిగినట్టుగా ఏపీ ప్రభుత్వం గుర్తించింది. రిజిస్ట్రేషన్ శాఖలో అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిష్ట్రార్లపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటేసింది. నకిలీ చలాన్ల కుంభకోణంలో సొమ్మును రికవరీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వానికి నిధులు వచ్చే శాఖల్లో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయా అనే కోణంలో కూడ అధికారులు విచారణ చేస్తున్నారు. ఎక్సైజ్ , మైనింగ్ , రవాణా, కార్మిక శాఖల్లో ప్రభుత్వం అంతర్గతంగా విచారణను చేపట్టింది.ఆయా శాఖల్లో అవకతవకలను గుర్తిస్తే అందుకు బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.