రాజధాని రైతుల ఖాతాల్లో రూ.195కోట్లు... జగన్ సర్కార్ కీలక ఉత్తర్వులు
రాజధాని రైతుల కౌలు నిమిత్తం రూ. 195 కోట్లు విడుదల చేసినట్లు వైసిపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి: రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కౌలు నిధులను విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. రైతుల కౌలు నిమిత్తం రూ. 195 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం 29 గ్రామాలకు చెందిన రైతుల నుండి భూములను సేకరించారు. ఇలా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు పదేళ్లపాటు కౌలు ఇస్తామని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సీఆర్డీఏ చట్టంలో పొందుపర్చారు. ఇందులో భాగంగానే తాజాగా కౌలు సొమ్మును రైతుల ఖాతాలో జమచేశారు.
అయితే టీడీపీ ప్రభుత్వం కంటే తాము అధికంగా పరిహార భృతిని ఇస్తామని జగన్ సర్కార్ హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు పెన్షన్ ను రూ. 2500 నుండి రూ. 5 వేలకు పెంచారు. పెన్షన్ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై అదనంగా నెలకు రూ. 5.2 కోట్ల భారం పడనుంది. ఏడాదికి రూ. 60.30 కోట్ల భారం పడే అవకాశం ఉంది.