తెలంగాణలోకి అనుమతి ఇవ్వకపోవడంపై  న్యాయపరమైన పోరాటం చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.  

అమరావతి: తెలంగాణలోకి అనుమతి ఇవ్వకపోవడంపై న్యాయపరమైన పోరాటం చేయాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వైద్యం కోసం వచ్చే రోగులకు ప్రత్యేకమైన మార్గదర్శకాలను కేసీఆర్ సర్కార్ గురువారం నాడు విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ జారీ చేసింది. 

సరిహద్దుల్లో అంబులెన్స్‌లను నిలిపివేయడంపై తెలంగాణ హైకోర్టు కేసీఆర్ సర్కార్ పై సీరియస్ వ్యాఖ్యలు చేసింది. ఇదే విషయమై తెలంగాణ సీఎస్ తో ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మూడు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఈ అంశంపై న్యాయపరమైన పోరాటం చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.