Asianet News TeluguAsianet News Telugu

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు లేదు: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో  ఔట్  సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని  ఇచ్చిన ఆదేశాలపై ఏపీ సీఎం వైఎస్ జగన్  విచారణకు ఆదేశించారని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.
 

AP Government Advisor Sajjala Ramakrishna Reddy Clarifies On Outsourcing Employees
Author
First Published Dec 5, 2022, 2:38 PM IST

అమరావతి: రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.సోమవారంనాడు తాడేపల్లిలో  ఆయన మీడియాతో  మాట్లాడారు. ఓ ప్రభుత్వ విభాగంలో కొద్దిమంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల చెప్పారు.ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించాలని  ఇచ్చిన  ఆదేశాలను వెంటనే ఉపసంహరింపజేయాలని సీఎం ఆదేశించారని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో  ఔట్ సోర్సింగ్ సిబ్బంది తొలగించారనే  అంశంపైనా విచారణ జరుగుతుందని సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు.రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరినీ  తొలగించే ప్రసక్తే లేదని ఆయన  స్పష్టం  చేశారు. 

రాయలసీమకు  వైఎస్ జగన్ అన్యాయం చేస్తున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. రాయలసీమకు వైఎస్ ఆర్ సహా జగన్  ఏం చేశారనే విషయం అక్కడి ప్రజలకు తెలుసునని సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు.ఎడారి లాంటి పులివెందులలో నీరు నింపి బోటింగ్‌ను  కూడా సీఎం ప్రారంభించిన విషయాన్ని ఆయన  ఈ సందర్భంగా  గుర్తు చేశారు.రాయలసీమకు శ్రీశైలం నుంచి వరద జలాలు ఇవ్వాలని కాలువల వెడల్పు చేపట్టారన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీరు లిఫ్ట్ చేసేందుకు సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని  రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు  చెప్పారు. 

 పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు ౩ టీఎంసీలు లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎన్జీటీలో కేసు వేసి చంద్రబాబు అడ్డుకున్నారని  సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. హంద్రీనీవా , వెలిగొండ పనులను సీఎం జగన్ పూర్తి చేస్తున్నారని  చెప్పారు. కుప్పం బ్రాంచి కెనాల్ ను కూడా చంద్రబాబు పూర్తి చేయకపోతే వైఎస్ జగన్ పూర్తి చేశారన్నారు. ఐదు మెడికల్ కళాశాలు రాయలసీమలో  ఏర్పాటు చేయనున్నట్టుగా  సజ్జల రామకృష్ణారెడ్డి  తెలిపారు. క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ లు  కూడా రాయలసీమ కు వస్తున్నాయన్నారు. సీఎం వైఎస్ జగన్ హయాంలోనే పోలవరం పూర్తవుతుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios